హైదరాబాద్, మార్చి 13 (నమస్తే తెలంగాణ): వన్యప్రాణుల సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతున్నది. వాటి సంఖ్యను పెంచడమే లక్ష్యంగా ప్రణాళికను రూపొందించుకొని ముందుకు సాగుతున్నది. దీనిలో భాగంగా కిన్నెరసాని వైల్డ్లైఫ్, భద్రాచలం ఫారెస్ట్ బేస్క్యాంప్లు ఏర్పాటు చేసింది. వేసవిలో మంటలు వ్యాపించకుండా నిరోధించేందుకు ప్రత్యేక బృందాలను నియమించింది. వన్యప్రాణుల వేటను అడ్డుకొనేందుకు సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసింది. ప్రస్తుతం కిన్నెరసాని, భద్రాచలం అటవీ ప్రాంతాల్లో అడవి దున్నలు, దుప్పులు, జింకలు, అడవి పందులు, ఎలుగుబంట్లు, కొండగొర్రెలు, విషసర్పాలు, కోతులు, కొండముచ్చులు, అనేక రకాల పక్షులు ఉన్నాయి.
వేసవిలో వన్యప్రాణులకు తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు ప్రభుత్వం ఎకడికకడ సాసర్పిట్స్ (నీటి తొట్టెలు), చెక్డ్యామ్లు, వాగులు, సోలార్ పంప్సెట్లను ఏర్పాటు చేసి నీటి వసతి కల్పించింది. చిన్న జంతువులు సైతం సులభంగా నీరు తాగేలా వీటిని చాలా తక్కువ ఎత్తులో నిర్మించి వారానికి ఒకటి రెండుసార్లు నీటిని నింపుతున్నది. అంతేకాకుండా నీటి నిల్వ కోసం అడవి మధ్యలో వాటర్ రింగ్స్నూ ఏర్పాటు చేసింది.
అడవుల్లో అగ్ని ప్రమాదాల నివారణకు అటవీశాఖ కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. చిన్న నిప్పురవ్వ రగిలినా ఉపగ్రహం ద్వారా తక్షణమే గుర్తించి ఆర్పివేసే విధానాన్ని అమలు చేస్తున్నది. పోడు భూముల కోసం అడవుల్లో పెట్టే మంటలను అక్కడే అదుపులోకి తెచ్చేందుకు ‘ఫైర్లైన్’ విధానాన్ని కొనసాగిస్తున్నది. బాటలున్న ప్రాంతాల్లో రెండు వైపులా రెండున్నర మీటర్ల వరకు ఉన్న ఆకులు, పొదలను ముందుగానే తగలబెడుతున్నది. అడవుల్లో నిప్పు రాజేసేవారిని, వన్యప్రాణులను వధించేవారిని కఠినంగా శిక్షించేందుకు చర్యలు చేపడుతున్నది.
అడవుల్లో అగ్ని ప్రమాదాలను గుర్తించేందుకు అటవీశాఖ ఆధునిక సాంకేతికతను అందుబాటులోకి తెచ్చింది. అధికారుల వద్ద ఉండే మొబైల్ ఫోన్లకు ఈ సాంకేతికతను అనుసంధానించి హైదరాబాద్లోని కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తున్నది. అడవిలో ఎక్కడ చిన్న మంట రగిలినా ఉపగ్రహ సాయంతో వెంటనే గుర్తించి అధికారుల మొబైల్ ఫోన్లకు సంక్షిప్త సందేశాలు పంపేలా ఏర్పాట్లు చేసింది. చెట్లు, పొదల్లోకి మంటలను ఆర్పేందుకు ‘ఫైర్ బ్లోయర్’ పరికరాలను ఉపయోగిస్తున్నది.