ప్రభుత్వరంగ సంస్థలను పూర్తిగా వదిలించుకోవాలని చూస్తున్న నరేంద్ర మోదీ సర్కార్ ఆ దిశగా మరో కీలక నిర్ణయం తీసుకొన్నది. దాదాపు పది పీఎస్యూలలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను వేగవంతం చేయనున్నట్టు ఆర్థిక సర్వేలో తెలిపింది. సోమవారం ప్రారంభమైన పార్లమెంటు బడ్జెట్ సమావేశాల తొలిరోజున కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ సర్వేను సభకు సమర్పించారు. పీఎస్యూలను ప్రైవేట్పరం చేయడమే కాకుండా.. ఆయా సంస్థలకు దేశవ్యాప్తంగా ఉన్న భూములపై కూడా మోదీ సర్కారు కన్నుపడింది. వీటిని విక్రయించడానికి ఏకంగా నేషనల్ ల్యాండ్ మానిటైజేషన్ కార్పొరేషన్ను కూడా ఏర్పాటు చేసేసింది. ప్రస్తుతానికి 3,400 ఎకరాల భూమిని గుర్తించి, వీటిని విక్రయించే బాధ్యతను సైతం ఈ కార్పొరేషన్కు అప్పగించింది. రానున్న నాలుగేండ్లలో రూ. 6 లక్షల కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2021-22లో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 9.2% వృద్ధి చెందవచ్చని పేర్కొన్న ఆర్థిక సర్వే.. వచ్చే ఆర్థిక సంవత్సరం (2022-23)లో 8% నుంచి 8.5% మధ్యకు పడిపోతుందని అంచనావేసింది. అదే సమయంలో రోజురోజుకూ పెరుగుతున్న ద్రవ్యోల్బణం ఆందోళనకరమని వెల్లడించింది. వ్యవసాయ సంక్షోభానికి కారణం ఆర్అండ్డీ లేకపోవడమేనని తెలిపింది. పంటలమార్పిడి తప్పనిసరి అని విస్పష్టంగా తేల్చిచెప్పింది. ధాన్యం కొనుగోళ్ల విషయంలో నానాయాగీ చేసిన రాష్ట్ర బీజేపీ నేతలు ఇప్పుడేమంటారో మరి! భవిష్యత్తు సవాళ్లను ఎదుర్కొనేందుకు ఆర్థిక వ్యవస్థ సంసిద్ధమై ఉన్నదని సర్వే తెలిపింది.
న్యూఢిల్లీ, జనవరి 31: ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు ఎయిర్ ఇండియా అమ్మకం కొత్త ఉత్సాహాన్నివ్వనుందని ఆర్థిక సర్వేలో కేంద్ర ప్రభుత్వం పేర్కొన్నది. అన్ని రంగాల్లో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించేందుకు వ్యాపార సంస్థల్లో ప్రభుత్వ రంగ పాత్రను పునర్నిర్వచించాల్సిన అవసరం ఉన్నదని సోమవారం పార్లమెంట్లో ప్రకటించిన 2021-22 ఆర్థిక సర్వే తెలిపింది. సరికొత్త, స్వావలంబ భారతానికి ఇది ఎంతో అవసరమని అభిప్రాయపడింది. ఇటీవలే ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్నకు రూ.18,000 కోట్లకు కేంద్రం విక్రయించిన విషయం తెలిసిందే. ఇందులో రూ.2,700 కోట్లు నగదు రూపంలో కేంద్ర ప్రభుత్వానికి అందగా, రూ.15,300 కోట్ల ఎయిర్ ఇండియా రుణ భారాన్ని టాటా గ్రూప్ తీసుకున్నది. ‘ఎయిర్ ఇండియా ప్రైవేటీకరణ విజయవంతం కావడం చాలా ముఖ్యమైన అంశం. పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియకేగాక మిగతా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ వేగిరం కావడానికి ఇది ఎంతగానో దోహదం చేయనున్నది’ అని సర్వే అభిప్రాయపడింది. కాగా, గడిచిన 20 ఏండ్లలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ ప్రైవేట్పరం కావడం ఇదే తొలిసారి అవడం గమనార్హం. 2016 నుంచి 35 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లేదా వాటి అనుబంధ సంస్థలు, యూనిట్లు, జాయింట్ వెంచర్లలో వాటాల అమ్మకానికి మోదీ సర్కారు ఆమోదం తెలిపింది. గతేడాది ప్రభుత్వ రంగ సంస్థల్లో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ విధానానికీ కేంద్రం పచ్చజెండా ఊపింది. నిరుడు డిసెంబర్ 13న ఇందుకోసం కొత్త మార్గదర్శకాలను ప్రవేశపెట్టింది. తద్వారా కేంద్ర ప్రభుత్వ సంస్థలను వ్యూహాత్మక, వ్యూహాత్మకేతర విభాగాలుగా నిర్ణయించారు. దీనివల్ల పీఎస్యూల్లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ వేగవంతం కాగలదని ఆర్థిక సర్వే చెప్పింది. అటామిక్ ఎనర్జీ, స్పేస్, డిఫెన్స్, రవాణా, టెలీకమ్యూనికేషన్స్, పవర్, పెట్రోలియం, బొగ్గు, ఇతర ఖనిజాలు, బ్యాంకింగ్, బీమా, ఆర్థిక సేవలను వ్యూహాత్మక రంగాలుగా పేర్కొన్నారు.
2014 తర్వాత వాటాలను విక్రయించిన సంస్థలు
ప్రైవేటీకరణకు సిద్ధంగా ఉన్న పీఎస్యూలు
గత ఏడేండ్లలో స్టాక్ మార్కెట్లలోకి వచ్చిన ప్రభుత్వ సంస్థలు