సిటీబ్యూరో, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ ) : జలమండలికి అవార్డుల పరంపర కొన సాగుతున్నది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా(పీఆర్ఎస్ఐ) జాతీయ అవార్డు 2021లో భాగంగా సొసైటీ నిర్వహించిన బెస్ట్ కమ్యూనికేషన్ క్యాంపెయిన్ విభాగాల్లో జలమండలికి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. దేశ నలుమూలల నుంచి ఎల్ఆండ్టీ, ఎన్ఎండీసీ, ఐటీసీ, హిందూస్తాన్ పెట్రోలియం, భారత్ పెట్రోలియం, ఎన్టీపీసీ వంటి ఎన్నో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఇందులో పోటీపడగా జలమండలి ఇందులో జాతీయ స్థాయిలో ద్వితీయ విజేతగా నిలిచింది. జీహెచ్ఎంసీ పరిధిలో నివసిస్తున్న అందరికీ 20వేల లీటర్ల ఉచిత తాగునీటి పథకం అందేలా జలమండలి వివిధ మాధ్యమాల్లో అవగాహన కల్పించింది.
జలమండలి ఆధ్వర్యంలో, శాస్త్రీయ పద్ధతిలో సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ గురించి పలు ఎన్జీవోలు, కార్యకర్తలకు శిక్షణ, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఆ పథకాలకు సంబంధించి బ్రోచర్లను సైతం రూపొందించింది. ఈ రెండింటిని పీఆర్ఎస్ఐ జాతీయ అవార్డులు 2021లో భాగంగా ఏర్పాటు చేసిన పోటీలకు పంపగా జలమండలి జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి గెలుచుకుంది. ఈనెల 28వ తేదీన వర్చ్యువల్ పద్ధతిలో బహుమతుల ప్రదానోత్సవం జరగనున్నది. ఈ సందర్భంగా జలమండలి ఎండీ దానకిశోర్ హర్షం వ్యక్తం చేశారు. జలమండలి కమ్యూనికేషన్ క్యాంపెయిన్ విభాగంలో బహుమతి రావడం ఆనందంగా ఉందన్నారు. ఇందుకోసం కృషి చేసిన సిబ్బందిని దానకిశోర్ అభినందించారు.