అమీర్పేట్, జనవరి 19: నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. మాసబ్ ట్యాంక్లోని తన ఛాంబర్లో హైదరాబాద్ కలెక్టర్ శర్మన్, మేడ్చల్ కలెక్టర్ హరీష్లతో బుధవారం సమావేశమై సనత్నగర్ నియోజకవర్గంలోని పలు అంశాలపై చర్చించారు. రాంగోపాల్పేట్ డివిజన్ పరిధిలోని వెంగళ్రావునగర్, సనత్నగర్ పరిధిలోని శ్యామల కుంట బస్తీల్లో దశాబ్దాల కాలంగా నిరు పేదలు నివాసాలు ఏర్పాటు చేసుకున్నారని, వారికి అదే ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇచ్చేందుకు వీలైన అవకాశాలను పరిశీలించాలని ఆదేశించారు. అనంతరం, ఇరు జిల్లాల కలెక్టర్లతో కలిసి బేగంపేట్లోని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. పర్యటనలో సికింద్రాబాద్ ఆర్డీవో వసంత కుమారి, బేగంపేట్ కార్పొరేటర్ మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.