నమస్తే తెలంగాణ నెట్వర్క్, మార్చి 23: అసెంబ్లీ తీర్మానించి, పార్లమెంట్కు పంపించిన గిరిజన రిజర్వేషన్ల పెంపు బిల్లు తమ వద్దకు రాలేదని కేంద్ర గిరిజన శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ తుడు చేసిన వ్యాఖ్యలపై గిరిజనులు భగ్గుమన్నారు. కేంద్ర మంత్రి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వ్యతిరేకంగా నినదించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీ దిష్టిబొమ్మలను దహనం చేసి నిరసన తెలిపారు. వెంటనే గిరిజన జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా వికారాబాద్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేంద్రం దిష్టిబొమ్మ దహనం చేశారు. హైదరాబాద్ ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో గిరిజన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు కరాటే రాజు నాయక్, గిరిజన శక్తి రాష్ట్ర అధ్యక్షుడు శరత్ నాయక్ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఎమ్మెల్యేలు మెచ్చా నాగేశ్వర్రావు, సండ్ర వెంకటవీరయ్య.. టీఆర్ఎస్ నాయకులు, గిరిజనులతో కలిసి రహదారులపై బైఠాయించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ ఆధ్వర్యంలో లింగంపేటలో గిరిజనులు ధర్నా చేశారు. మహబూబాబాద్ జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే శంకర్నాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు కేంద్ర మంత్రి, ప్రధాని దిష్టిబొమ్మలను తగులబెట్టారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లో బంజారాసేవాలాల్ సంఘ్ రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ చౌహాన్, జిల్లా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ కమిటీ సభ్యుడు రవీందర్నాయక్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట గిరిజనులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా చేశారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో టీఎస్ఎంఎస్ఐడీసీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ప్రధాని మోదీ దిష్టిబొమ్మలకు శవయాత్రలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో ఎమ్మెల్యే రేఖానాయక్ ఆధ్వర్యంలో గిరిజనులు ధర్నా చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా దేవరకొండ, తిరుమలగిరి, మిర్యాలగూడ, త్రిపురారంలో గిరిజనులు చేపట్టిన నిరసనల్లో ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, గాదరి కిశోర్కుమార్, నల్లమోతు భాస్కర్రావు, నోముల భగత్ పాల్గొని మద్దతు తెలిపారు.
గిరిజనులకు రిజర్వేషన్లు పెంచాలని అసెంబ్లీలో తీర్మానించి పార్లమెంట్కు పంపించినం. గిరిజన రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన ప్రతిపాదనే తమకు రాలేదని కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ తుడుం చెప్తున్న మాటలు ముమ్మాటికీ అబద్ధాలే. కేంద్ర ప్రభుత్వం వెంటనే దళిత జాతికి క్షమాపణ చెప్పాలి.
– విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి