న్యూఢిల్లీ, జనవరి 3: ప్రభుత్వరంగ సంస్థల లాభాలు అంతకంతకు పెరుగుతున్నాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను ఏకంగా రూ.2.50 లక్షల కోట్ల లాభాలు ఆర్జించాయి పీఎస్యూలు. కమోడిటీ, విద్యుత్ రంగాల్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలు (సీపీఎస్ఈలు) 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను రూ.2.49 లక్షల కోట్ల మేర లాభాలు వచ్చాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సర్వే ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ప్రభుత్వ రంగ సంస్థల్లోకెల్లా ఓఎన్జీసీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), పవర్గ్రిడ్, ఎన్టీపీసీ, సెయిల్లు అత్యధిక లాభాల్ని ఆర్జించాయి.
అంతక్రితం 2020-21లో వచ్చిన రూ.1.65 లక్షల కోట్ల లాభాలతో పోలిస్తే ఇది 50.87 శాతం అధికం. మరో వైపు టెలికం రంగంలోని పీఎస్యూలు మాత్రం నష్టాల్ని చవిచూశాయి. నష్టాలు తెచ్చుకున్న పీఎస్యూల జాబితాలో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్), మహానగర్ టెలికం నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)లు తొలి రెండు స్థానాల్ని ఆక్రమించగా.. ఎయిర్ ఇండియా అసెట్ హోల్డింగ్ లిమిటెడ్, ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్, అలియన్స్ ఎయిర్ ఏవియేషన్లు సైతం నష్టాల బారిన పడ్డాయి. అయితే నష్టపూరిత పీఎస్యూల నష్టాలు 2021-22లో రూ. 0.23 లక్షల కోట్ల నుంచి రూ.0.15 లక్షల కోట్లకు తగ్గాయి. 2022 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరపు సర్వే వివరాలు..