హైదరాబాద్: పిల్లల ఎదుగుదల సమస్యలను బాల్యంలోనే గుర్తించడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించు కోవచ్చని తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖామంత్రి తలసాని తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. బాలల దినోత్సవం సందర్భంగా ఆదివారం మణికొండలో ఇగ్నీషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ఇటీవలి కాలంలో చిన్నారులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల సమస్యలను సకాలంలో గుర్తించి సరైన శిక్షణ, థెరపీ అందించాలని సూచించారు. ఈ దిశగా కృషి చేస్తున్న ఇగ్నీషియో వ్యవస్థాపకురాలు డాక్టర్ విష్ణుప్రియను అభినందించారు.
పిల్లలు వయసుకు తగ్గట్లు మాట్లాడలేకపోతే వెంటనే స్పీచ్ లాంగ్వేజ్ పాథాలజిస్ట్ ను సంప్రదించాలని ప్రముఖ పిల్లల వైద్యులు డాక్టర్ మోతుకూరి కృష్ణమూర్తి, డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. పిల్లలు బాగా పెరగడమే అభివృద్ధి కాదని, వాళ్ల వయసుకు తగ్గట్టుగా మానసిక వికాసం ఉందో లేదో తల్లిదండ్రులు గమనించుకోవాలని ప్రముఖ సైకాలజిస్టులు డాక్టర్ విశేష్, డాక్టర్ సోమశేఖర్ సూచించారు. పిల్లలను టీవీకి, ఫోన్లకు వదిలేయకుండా తల్లిదండ్రులు వాళ్లతో సరైన సమయం గడపాలని, వాళ్ల వయసుకు తగ్గ పనులన్నీ నేర్పించాలని ఇగ్నీషియో ఎండీ డాక్టర్ విష్ణుప్రియ వెల్లడించారు.