హైదరాబాద్, నవంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం (టీఆర్జీవోఏ) నేతలు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు బుధవారం ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావుకు వినతిపత్రాన్ని సమర్పించారు. పెన్షనర్ల బకాయిలను చెల్లించాలని, 2018 జనవరి 1 తర్వాత పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అమలుచేయాలని, పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలని, పరిమితిలేని నగదురహిత వైద్యసేవలందించాలని వినతిపత్రంలో కోరారు. సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎం మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి సరికొండ నరసరాజు, రాష్ట్ర నాయకులు విష్ణువర్ధన్రావు, దశరథరావు తదితరులు మంత్రిని కలిసిన వారిలో ఉన్నారు.