న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: రక్షణ రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి బడ్జెట్లో పెద్దపీట వేశారు. స్వదేశీ ఉత్పత్తి అంటూ గొప్ప ఆదర్శాలను ప్రకటించినప్పటికీ అంతిమంగా ప్రభుత్వ రంగం కన్నా ప్రైవేటు రంగానికి లబ్ధి చేకూర్చడమే ధ్యేయంగా విధానపరమైన నిర్దేశం చేశారు. రక్షణ రంగం కేటాయింపును గతేడాది కంటే స్వల్పంగా పెంచారు. 2021-22లో రూ.4.78 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి రూ.5.25 కోట్లు కేటాయించారు. ఇందులో రూ.1,52,369 కోట్లు కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధనౌకలు, ఇతర సైనిక పరికరాల కొనుగోలు వంటి వాటికి పెట్టుబడి వ్యయంగా చూపారు. జీతాలు, సంస్థల నిర్వహణ ఖర్చులకు రూ.2,33,000 కోట్లు కేటాయించారు. పింఛన్లకు విడిగా రూ..1,19,696 కోట్లు కేటాయించారు. పరిశోధన-అభివృద్ధి బడ్జెట్లో 25 శాతం స్టార్టప్లు, ప్రైవేటు రంగానికి కేటాయించడం గమనార్హం. డీఆర్డీవో తదితర సంస్థలతో కలిసి ప్రైవేటు సంస్థలు ప్రత్యేక అనుబంధ విభాగాలను ఏర్పాటు చేసి సైనిక పరికరాల డిజైన్, అభివృద్ధిలో పాల్గొంటాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.