ముంబై, నవంబర్ 26: ప్రైవేట్ బ్యాంక్ల ప్రమోటర్లకు రిజర్వ్బ్యాంక్ తీపికబురు చెప్పింది. బ్యాంక్ యాజమాన్య నిర్వహణ ప్రమోటర్ల చేతిలో ఉండేందుకు వీలుకల్పించే సిఫార్సును శుక్రవారం ఆర్బీఐ ఆమోదించింది. దీంతో బ్యాంక్ 15 సంవత్సరాలు మనుగడసాగించిన తర్వాత కూడా ప్రమోటర్లు..ఓటింగ్ ఈక్విటీలో 26 శాతం వాటాను అట్టిపెట్టుకోవొచ్చు. ప్రస్తుతం ఈ పరిమితి 15 శాతమే. ఈ పరిమితిని తాజాగా 26 శాతానికి పెంచింది. ప్రైవేట్ బ్యాంక్ల్లో కార్పొరేట్ల యాజమాన్యానికి సంబంధించి వర్కింగ్ గ్రూప్ చేసిన 33 సిఫార్సుల్లో 21 సిఫార్సుల్ని ఆమోదించినట్లు ఆర్బీఐ తెలిపింది. ప్రస్తుత నిబంధన ప్రకారం వాటాను తగ్గించుకోవాల్సిఉన్న కొటక్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి బ్యాంక్ యాజమాన్యాలకు తాజా ఆర్బీఐ ప్రకటన ఊరట కల్పించనున్నది.
ప్రైవేట్ బ్యాంక్ ప్రారంభమైన తర్వాత ఐదేండ్ల వరకూ పెయిడ్అప్ ఓటింగ్ ఈక్విటీలో 40 శాతం ప్రమోటర్ల వాటా లాక్-ఇన్లో ఉండాలన్న నిబంధనలో మార్పు చేయకూడదన్న సిఫార్సును సైతం రిజర్వ్ బ్యాంక్ ఆమోదించింది.
కొత్తగా బ్యాంక్ను ప్రారంభించాలంటే ప్రమోటర్లు మరిన్ని పెట్టుబడులు చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ లైసెన్సు కోసం ఈక్విటీ క్యాపిటల్ పరిమితిని రూ.500 కోట్ల నుంచి రూ. 1000 కోట్లకు పెంచాలన్న వర్కింగ్ గ్రూప్ సిఫార్సును ఆర్బీఐ ఆమోదించింది. స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మూలధన పరిమితిని రూ. 300 కోట్లకు చేర్చింది.