సామాన్యుడిని పెండ్లాడిన జపాన్ రాకుమారి
టోక్యో, అక్టోబర్ 26: మనసు దోచిన చెలికాడి కోసం రాజభోగాల్ని తృణప్రాయంగా కాదనుకున్నది ఓ రాకుమారి. సామాన్యుడిని పెండ్లాడితే రాచరిక హోదాను వదులుకోవాల్సి వస్తుందన్న ఆ దేశ రాజనీతి తెలిసినప్పటికీ.. ఆమె ఎంతమాత్రం చలించలేదు. కోరుకున్న ప్రియుడితోనే తన వందేండ్ల ప్రయాణమంటూ ఏడడుగులేసింది. జపాన్ యువరాణి మకో ఎట్టకేలకు తన మూడేండ్ల ప్రేమను గెలిపించుకున్నది. సామాన్యుడైన కీ కొమురోతో వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. ఈ మేరకు జపాన్ రాజసౌధం ఇంపీరియల్ హౌస్హోల్డ్ ఏజెన్సీ మంగళవారం వెల్లడించింది. పరిమిత అతిథుల మధ్య నిరాడంబరంగా రాకుమారి వివాహం జరిగినట్టు పేర్కొంది. యువరాణి మకో.. భర్త ఇంటిపేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నట్టు వివరించింది. అలాగే, రాజభరణం కింద తనకు వచ్చే రూ.9.19 కోట్లు (140 మిలియన్ యెన్లు) మొత్తాన్ని కూడా తిరస్కరించినట్టు తెలిపింది. జపాన్ చక్రవర్తి నరుహిటో సోదరుడి కుమార్తెనే మకో. టోక్యో ఇంటర్నేషనల్ క్రిస్టియన్ యూనివర్శిటీలో చదువుకునే సమయంలో కొమురోను ఇష్టపడ్డారు. పెండ్లి చేసుకోబోతున్నట్టు 2017లోనే ఈ జంట ప్రకటించినప్పటికీ.. కుటుంబ, ఆర్థిక సమస్యల కారణంగా బ్రేక్ పడింది. తాజాగా ఇరు కుటుంబాలు అంగీకరించడంతో ఇద్దరూ వివాహబంధంతో ఒక్కటయ్యారు.