న్యూఢిల్లీ, డిసెంబర్ 22: పార్లమెంటు శీతాకాల సమావేశాలు 24 రోజుల పాటు జరిగాయి. ఇందులో 18 సార్లు ఉభయ సభల్లో పలు అంశాలపై చర్చలు జరిగాయి. కానీ వీటిల్లో ప్రధాని మోదీ కేవలం రెండంటే రెండు రోజులే హాజరయ్యారు. అది కూడా సమావేశాలు ప్రారంభం అయిన మొదటి రోజు.. ముగిసిన చివరి రోజైన బుధవారం. మిగతా రోజులన్నీ మోదీ సమావేశాలకు దూరంగానే ఉన్నారు. దీనిపై కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. మోదీతో పాటు మంత్రులు కూడా సమావేశాలకు సరిగ్గా హాజరు కాలేదని పేర్కొన్నారు. పలు అంశాలపై సప్లిమెంటరీ ప్రశ్నలు అడుగుదామంటే మంత్రులు గైర్హాజరయ్యారని పేర్కొన్నారు. ఏ అంశం మీదనైనా చర్చించడానికి సిద్ధం అని ప్రకటించి సమావేశాలకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు.
ఒక్కరోజు ముందే ముగింపు
పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంతో ముగిశాయి. షెడ్యూల్ ప్రకారం గురువారం దాకా జరగాల్సి ఉంది. అయితే, కేంద్రప్రభుత్వం ఒకరోజు ముందుగానే సమావేశాలను ముగించింది. ముఖ్యమైన బిల్లులకు ఆమోదం లభించడంతో సమావేశాలను నిరవధికంగా వాయిదా వేసినట్టు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రకటించారు. లోక్సభ 82%, రాజ్యసభ 48% ఫలప్రదంగా పనిచేసినట్టు చెప్పారు. సమావేశాలు నవంబర్ 29న ప్రారంభం అయ్యాయి. ఈ సెషన్లో మొత్తం 13 బిల్లులను ప్రవేశపెట్టారు. 11 బిల్లులకు ఉభయ సభల ఆమోదం లభించింది. నిరవధిక వాయిదాపై కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే విలేకరులతో మాట్లాడారు. ‘అనుకొన్న బిల్లులను హడావుడిగా ఆమోదింపజేసుకోవడమే బీజేపీ ఎజెండా. దాన్ని పూర్తి చేసుకొన్నారు’ అని విమర్శించారు. రాజ్యసభలో సంఖ్యా బలం లేకపోయినా అప్రజాస్వామికంగా బిల్లులను ఆమోదింపజేసుకొన్నారని ఆరోపించారు.
మీడియాను పార్లమెంట్లోకి రానివ్వండి
కొవిడ్ సాకుతో పార్లమెంటులోకి మీడియాను అనుమతించకపోవడం తగదని ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా(పీసీఐ) అభిప్రాయపడింది. ఈ ఆంక్షలను ఎత్తివేయాలని కేంద్రప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బుధవారం తీర్మానం చేసింది. మీడియా ప్రతినిధులను పార్లమెంటులోకి అనుమతించకపోవడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని విమర్శించింది. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఈ తీర్మానం చేశారు. ప్రెస్ క్లబ్ డిమాండ్ను ఎంపీ ఎన్కే ప్రేమ చంద్రన్ సమర్థించారు.