కాచిగూడ : భారత రాజ్యాంగాన్ని మార్చి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లను ఎత్తివేయాలని కుట్ర చేస్తుందని వస్తున్న ఆరోపణలపై కేంద్రంలోని బీజేపీ స్పష్టమైన ప్రకటన చేయాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnaiah) డిమాండ్ చేశారు.
జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం కాచిగూడలోని అభినందన్ హోటల్లో 13 బీసీ సంఘాలతో సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఆర్.కృష్ణయ్య హాజరై మాట్లాడుతూ ప్రధాని మోదీ (Modi) రిజర్వేషన్ల (Reservations) పై స్పష్టమైన ప్రకటన చేశాకనే హైదరాబాద్లో అడుగుపెట్టాలని హెచ్చరించారు. బీసీలు భారతమాత బిడ్డలని, బీసీలంటే బిచ్చగాళ్లు కాదని, బీసీ (BC) లంటే వాటాదారులని పేర్కొన్నారు.
దేశంలోని 75 కోట్ల మంది బీసీలకు రాజ్యాంగపరమైన హక్కులను కల్పించకుండా కేంద్రం అణిచివేస్తుందన్నారు. బీసీల హక్కులను పరిష్కరించకుంటే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదించే రోజు అసన్నమైందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నీల వెంకటేశ్, రాజేందర్, అంజి, వేముల రామకృష్ణ, సత్యనారాయణ, ఉదయ్, తిలక్సింగ్,శివ,రమేశ్,జ్యోతి, భాగ్యలక్ష్మి,తదితరులు పాల్గొన్నారు.