ఆదిలాబాద్ : ఈ నెల 30న జరిగే హుజురాబాద్ ఎన్నికల్లో అర్చక ఉద్యోగ రాష్ట్ర జేఏసీ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు తెలుపుతూ తీర్మానం చేసింది. ఈ మేరకు బుధవారం ఆదిలాబాద్లో అర్చక ఉద్యోగ రాష్ట్ర కమిటీ సమావేశంలో అర్చక, ఉద్యోగ జేఏసీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గంగు ఉపేందర్ శర్మ మాట్లాడారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అర్చక, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అర్చక ఉద్యోగులకు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా ప్రభుత్వం వేతనాలు అందిస్తుందన్నారు. ధార్మికభావన కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేస్తున్నారని తెలిపారు.
గత ప్రభుత్వాల హయాంలో నిర్వీర్యమైన దేవాలయాల అభివృద్ధికి సీఎం నిధులు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. కరోనా సమయంలో ఆలయాల్లో ఆర్జిత సేవలు నిలిపివేసినా, కష్టసమయంలో సైతం ప్రభుత్వం అర్చకులకు వేతనాలను అందించారని కొనియాడారు. ధూప, దీప, నైవేధ్య అర్చకులకు నెలకు రూ. 6 వేల భృతి కల్పిస్తూ, బ్రాహ్మణ సంక్షేమానికి రూ.190 కోట్లు కేటాయించి బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ద్వారా ఉపాధి కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అర్చక జేఏసీ కన్వీనర్ పరుశురాం రవీంద్రచార్యులు, రాష్ట్ర ఉద్యోగుల సంఘం జేఏసీ అధ్యక్షుడు తాండూరి కృష్ణమాచారి, ఆదిలాబాద్ జిల్లా జేఏసీ కన్వీనర్ కనగంటి విలాస్ శర్మ, ప్రధాన కార్యదర్శి నరహరి శర్మ, కన్వీనర్ గోవర్థనం, 32 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులు పాల్గొన్నారు.