భీమదేవరపల్లి, మార్చి 24: కోరిన కోరికలు తీర్చే హనుమకొండ జిల్లా కొత్తకొండ(Kothakonda) వీరభద్ర స్వామి దేవస్థానంలో అభిషేకం పూజలు చేస్తున్న క్రమంలో హారతి పళ్లెంలో వచ్చిన డబ్బులు హుండీలోనే వేయాలని ఆలయ అర్చకుడు నందనం సందీప్ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తకొండలోని స్వామివారి ఆలయంలో నమస్తే తెలంగాణతో ఆయన మాట్లాడారు. తెలంగాణలో ప్రసిద్ధిగాంచిన ఆలయాల్లో పూజల కంటే ఆ పేరుతో భక్తులను దోచుకున్న దోపిడీయే ఎక్కువ అవుతుందని మండిపడ్డారు.
గోత్ర నామార్చన పేరుతో అర్చకులు భక్తుల గోత్ర, నామాలు చదివి చివరకు సహ కుటుంబ నాం..అని చెప్పి హారతిలో వేసిన డబ్బులను దిగమింగుతున్నారని ఆరోపించారు. వెంటనే ఇటువంటి దోపిడీలను అరికట్టాలని.. ఆలయాలను అభివృద్ధి దిశలో కొనసాగిస్తున్న దేవదాయ, ధర్మాదాయ శాఖను విజ్ఞప్తి చేశారు.