హైదరాబాద్, ఏప్రిల్ 22 (నమస్తే తెలంగాణ): మలేరియా నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషికి జాతీయ గుర్తింపు లభించింది. తెలంగాణలో మలేరియా కేసులు గత ఆరేండ్లలో (2015-2021మధ్య) గణనీయంగా తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. తద్వారా రాష్ట్రం క్యాటగిరీ-2 నుంచి కాటగిరీ-1లో చేరినట్టు పేర్కొన్నది. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ఈ నెల 25న ఢిల్లీలో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో తెలంగాణను కేంద్రం సతరించనున్నది. ఈ కార్యక్రమానికి రావాలని శుక్రవారం రాష్ట్ర వైద్యారోగ్య శాఖకు ఆహ్వానం పంపింది.
మలేరియా నియంత్రణలో తెలంగాణకు జాతీయ గుర్తింపు రావడంపై ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి టీ హరీశ్రావు హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ చేపట్టిన పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఏటా వర్షాకాలం మొదట్లోనే గ్రామాలు, పట్టణాల్లో వ్యర్థాలను తొలగించడం, శిథిలావస్థలో ఉన్న ఇండ్లను కూల్చివేయడం, నీరు నిల్వ ఉండకుండా ‘డ్రైడే’ నిర్వహించడం లాంటి కార్యక్రమాలతో దోమలను నియంత్రించడం వల్లే మలేరియా కేసులు గణనీయంగా తగ్గాయని చెప్పారు.
రాష్ట్రంలో మలేరియా కేసులు గణనీయంగా తగ్గినట్టు ఇటీవల విడుదల చేసిన ‘నేషనల్ హెల్త్ ప్రొఫైల్-2021’లో కేంద్ర వైద్యారోగ్య శాఖ పేర్కొన్నది. ఈ నివేదిక ప్రకారం 2016లో రాష్ట్రంలో 3,512 మలేరియా కేసులు నమోదవగా.. 2020 నాటికి ఆ సంఖ్య 870కి దిగివచ్చింది. అంటే.. ఐదేండ్లలోనే కేసులు 75 శాతం తగ్గాయి.
సంవత్సరం కేసుల సంఖ్య
2016 3,512
2017 2,688
2018 1,792
2019 1,711
2020 870