విశాఖపట్నం : తెలుగు భాష పరిరక్షణ, వ్యాప్తి ప్రజా ఉద్యమంగా రూపుదాల్చాల్సిన అవసరం ఉన్నదని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆకాంక్షించారు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాల ఘనతను సగర్వంగా చాటుకునేందుకు తెలుగు వారంతా సంఘటితం కావలసిన అవసరం ఉందని తెలిపారు. అన్ని రకాల తెలుగు సంస్థలను ఏక తాటి మీదకు తీసుకు రావాలన్న రాష్ట్రేతర తెలుగు సమాఖ్య ఆశయాన్ని అభినందించారు.
రాష్ట్రేతర తెలుగు సమాఖ్య 6వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన సమావేశంలో ముఖ్యఅతిధిగా అంతర్జాల వేదిక ద్వారా వెంకయ్యనాయుడు ప్రసంగించారు. మనుషులనే గాక తరాలను సైతం కలిపి ఉంచే గొప్ప శక్తి భాష, సంస్కృతులకు ఉన్నదన్నారు. తెలుగు రాష్ట్రాల వెలుపల ఉన్న తెలుగు వారు తమ సంస్కతి, సంప్రదాయాలను ముందు తరాలకు అందించేందుకు నడుం బిగించాలని పిలుపునిచ్చారు. మన ఆట, మన పాట, మన భాష, మన యాస, మన గోస, మన కట్టు, మన బొట్టు వంటి సంప్రదాయాలను పునరుజ్జీవింపచేసుకోవలసిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.
మనం మన భాషను విస్మరిస్తే మన సంస్కృతి, సాహిత్యం, ఆహార వ్యవహారాలు, అలవాట్లు, కట్టుబాట్లు అన్ని మన ముందు తరాలకు దూరమయ్యే ప్రమాదం ఉన్నదని వెంకయ్యనాయుడు తెలిపారు. మన మాతృభాష, సంస్కృతులను సగర్వంగా ప్రోత్సహించుకోవడమే కాకుండా ఇతరుల భాషా సంస్కృతులను గౌరవించాల్సిన అవసరం ఉన్నదన్నారు. ప్రాథమిక విద్య మాతృభాషలో సాగడం వల్ల విద్యార్థులు నేర్చుకోవడం సులభతరం అవుతుందన్న ఆయన.. నూతన విద్యా విధానం మాతృభాషకు పెద్ద పీటల వేయడం ఆనందించదగిన అంశమని తెలిపారు.
తెలుగు రాష్ట్రాలకు వెలుపల ఉన్న తెలుగు వారు తమ తమ రాష్ట్రాల్లో భాష-సంస్కృతుల గొప్పతనాన్ని చాటుకునే దిశగా ఆయా రాష్ట్రాల భాషల్లోకి తెలుగు సాహిత్య అనువాదం కోసం చొరవ తీసుకోవాలని సూచించారు. ఇతర భాషా సాహిత్యాలు మన తెలుగులోకి అనువాదమైనంతగా, తెలుగు సాహిత్యం అనువాదం కావడం లేదని, ఇందు కోసం ప్రభుత్వాలతో పాటు తెలుగు సంస్థలు కూడా చొరవ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బెంగాల్ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ శశి పంజా, ఆంధ్రప్రదేశ్ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్, ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ అధ్యక్షులు డాక్టర్ సీఎంకే రెడ్డి, రాష్ట్రేతర తెలుగు సమాఖ్య అధ్యక్షుడు సుందరరావు, కార్యదర్శి పీవీపీసీ ప్రసాద్ తదితరులు అంతర్జాల వేదిక ద్వారా పాల్గొన్నారు.
సహాయకురాలికి ముద్దిచ్చిన మంత్రి రాజీనామా
హాంగ్కాంగ్ యాపిల్ డెయిలీ మూసివేత
బరువు తగ్గాలా..? ఈ చిట్కాలు పాటించండి..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..