హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ దినపత్రిక యాపిల్ డెయిలీను మూసివేశారు. గురువారం రోజున చివరిసారి ప్రింట్ ఎడిషన్కు సంబంధించిన పత్రికలను మార్కెట్లో అమ్మేశారు. హాంగ్కాంగ్ ప్రజాస్వామ్యానికి అనుకూలంగా ఆ పత్రిక వార్తలు రాసేది. చైనా ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఆ పత్రికపై డ్రాగన్ దేశం తీవ్ర చర్యలకు పాల్పడింది. ఆ పత్రిక ఆస్తులను సీజ్ చేయడంతో దిక్కుతోచని స్థితిలో యాపిల్ డెయిలీని మూసివేశారు. గురువారం తెల్లవారుజామున 2 గంటలకే ఆ పత్రిక చివరి ఎడిషన్ను కొనుగోలు చేసేందుకు హాంగ్ కాంగ్ ప్రజలు రోడ్లపై కిలీమీటర్ల కొద్ది బారులు తీరారు. ఇటీవల ఆ పత్రిక వ్యవస్థాపకుడు జిమ్మే లేయ్ను చైనా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. హాంగ్ కాంగ్ నిరసనకారులను ప్రోత్సహించిన కేసులో యాపిల్ డెయిలీపై ఇటీవల దాడులు జరిగాయి. రిపోర్టర్లు, ఎడిటర్లను అరెస్టు చేశారు. చైనా జోక్యాన్ని ప్రశ్నిస్తూ యాపిల్ పత్రిక కథనాలు రాస్తున్న నేపథ్యంలో డ్రాగన్ దేశం ఆ పత్రికపై కత్తి దూసింది. యాపిల్ డెయిలీ చివరి రోజున పది లక్షల కాపీలను ముద్రించింది. ఉదయం 8.30 నిమిషాల్లోపే ఆ కాపీలన్నీ అమ్ముడుపోయాయి. దీంతో 26 ఏళ్ల యాపిల్ డెయిలీ ప్రస్థానం ముగిసింది.