శ్రీరాంపూర్ : దేశంలో పెరుగుతున్న బొగ్గు అవసరాలను దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత ఎక్కువగా బొగ్గును ఉత్పత్తి చేసి థర్మల్ విద్యుత్ కేంద్రాలకు సరఫరా చేయాల్సిన అవసరం ఉందని సింగరేణి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ శ్రీధర్ అన్నారు. శుక్రవారం సింగరేణి వ్యాప్తంగా 9 కోల్ హ్యాండ్లింగ్ ప్లాంటుల నుంచి జరుగుతున్న బొగ్గు రవాణాపై అన్ని ఏరియా జీఎంలతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రోజుకు 30 రైల్వే ర్యాకుల ద్వారా జరుగుతున్న బొగ్గు రవాణాను ఇకపై 34 ర్యాకులకు పెంచాలని సీహెచ్పీల జీఎం స్వామినాయుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. గతేడాది మొదటి అర్ధ సంవత్సరంలో కరోనా వల్ల సింగరేణి సీహెచ్పీల నుంచి కేవలం 179 లక్షల టన్నుల బొగ్గు మాత్రమే రవాణా జరిగిందని తెలిపారు.
ఈ ఏడాది ఆ పరిస్థితిని అధిగమించి 75 శాతం వృద్ధితో 6 నెలల కాలంలో 313 లక్షల టన్నులబొగ్గు రవాణా జరపడం అభినందనీయమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యంతో ముందుకు వెళ్తుందని, అందుకు అనుగుణంగా కొత్త సీహెచ్పీల నిర్మాణం పూర్తి కావాలని ఆదేశించారు. సత్తుపల్లి-కొత్తగూడెం మధ్య సింగరేణి కాలరీస్ దక్షిణ మధ్య రైల్వేస్ వారి భాగస్వామ్యంతో నిర్మిస్తున్న 54 కిలోమీటర్ల రైలు మార్గంపై కూడా అధికారులతో సమీక్షించారు.
ఈ రైలు మార్గంలో ఇప్పటికే 26 కిలో మీటర్ల రైలు మార్గం నిర్మాణం పూర్తయి రాకపోకల పరీక్షలు జరిపారని, మిగిలిన మార్గాన్ని డిసెంబర్ నాటికి పూర్తి చేయనున్నారని సివిల్ జీఎం రమేశ్ వివరించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు ఎస్ చంద్రశేఖర్, ఎన్ బలరాం, సత్యనారాయణ, జీఎంలు కే సూర్యనారాయణ, నాగభూషన్రెడ్డి, సురేందర్, శ్రీరాంపూర్ నుంచి జీఎం సురేశ్, సీహెచ్పీ డీవైజీఎం డీవీ రావు, పీఓ పురుషోత్తంరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, ఈఈ చంద్రశేఖర్ పాల్గొన్నారు.