Prasidh Krishna: ఇండియన్ ప్రీమియర్ లీగ్ మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది అనగా రాజస్థాన్ రాయల్స్కు షాక్ తగలింది. ఆ జట్టు ప్రధాన పేసర్ ప్రసిధ్ కృష్ణ టోర్నీ మొత్తానికి దూరం కానున్నాడు. వెన్నునొప్పితో బాధపడుతున్న అతను కోలుకునేందుకు మరింత సమయం పట్టనుంది. ఈ విషయాన్ని రాజస్థాన్ రాయల్స్ వెల్లడించింది. ‘వెన్నునొప్పి కారణంగా ప్రసిధ్ కృష్ణ 2023 ఐపీఎల్కు దూరం కానున్నాడు. అతను లంబార్ స్పాండిలోసిస్తో బాధ పడుతున్నాడు. దాంతో వైద్యులు సర్జరీ చేయించుకోవాలని చెప్పారు.
సర్జరీ తర్వాత ప్రసిధ్ కోలుకుని,మళ్లీ మైదానంలో అడుగుపెట్టేందుకు తగినంత విశ్రాంతి అవసరం. అతడికి అన్నివిధాలా మద్దతుగా నిలుస్తున్నాం’ అని ఆ ఫ్రాంఛైజీ తెలిపింది. అంతేకాదు ఆస్పత్రి మంచం మీద ఉన్న ప్రసిధ్ ఫొటోను ట్విట్టర్లో షేర్ చేసింది.
పోయిన సీజన్ వేలంలో ఈ పేసర్ను రూ. 10 కోట్లకు కొనుగోలు చేసింది. టోర్నీ ప్రారంభానికి ముందు ప్రసిధ్ కృష్ణ ఫిట్గా లేకపోవడంతో అతని ప్లేస్లో ఎవరిని తీసుకోవాలనే సందిగ్ధంలో రాజస్థాన్ రాయల్స్ ఉంది. దాంతో, అతని ప్లేస్లో సందీప్ శర్మ, ధవల్ కులకర్ణి, వరుణ్ అరోన్, విజయ్కుమార్ వైశాక్, అనికేత్ చౌదరీలో ఒకరిని తీసుకునే వీలుంది. వీళ్లలో సందీప్ శర్మకు ఐపీఎల్లో మంచి రికార్డు ఉంది. అతను గతంలో పంజాబ్ కింగ్స్, సన్రైజర్స్ హైదరాబాద్ జట్లకు ఆడాడు.
ఐపీఎల్ 16వ సీజన్ షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది. మార్చి 31న ఈ మెగా టోర్నీ ప్రారంభం కానుంది. 52 రోజుల పాటు ఫ్యాన్స్కు అసలైన క్రికెట్ మజాను అందివ్వనుంది. 16వ సీజన్ తొలి మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి. మే 28న అహ్మదాబాద్లో టైటిల్ పోరు జరగనుంది. హైదరాబాద్ వేదికగా 7 మ్యాచ్లు జరగనున్నాయి.
Be back soon, Skiddy. 💗
— Rajasthan Royals (@rajasthanroyals) February 17, 2023