కోటపల్లి, అక్టోబర్ 26: ప్రాణహిత పుష్కరాలను వచ్చే ఏడాది ఏప్రిల్ 13 నుంచి 24 వరకు నిర్వహించనున్నారు. క్రితం సారి 2010లో డిసెంబర్లో మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అర్జునగుట్ట, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని తుమ్మిడిహట్టి, జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం వద్ద ఈ పుష్కరాలను నిర్వహించారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరగ్గా.. ఈ సారి స్వరాష్ట్రంలో పెద్ద ఎత్తున నిర్వహించనున్నారు. ఈసారి నిర్వహించే పుష్కరాలను దృష్టిలో ఉంచుకొని అధికారులు ఇప్పటినుంచే ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దేవాదాయ శాఖ అధికారులు మంగళవారం అర్జునగుట్ట వద్ద ప్రాణహిత నదిని, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిహట్టి వద్ద గల పుష్కర ఘాట్ను సందర్శించారు. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు, ఈఈ రాజేశ్, అధికారులు అనూష, స్తపతుల బృందం ప్రాణహిత తీరంతోపాటు స్నాన ఘట్టాలు, శార్థ మండపాలు, కేశ ఖండన కోసం స్థలాలను పరిశీలించారు. ప్రాణహిత పుష్కరాల ప్రారంభోత్సవానికి సీఎం కేసీఆర్ వచ్చే అవకాశం ఉన్నదని దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విజయరామారావు తెలిపారు. తెలంగాణ ఏర్పాటు తరువాత మొదటిసారి పుష్కరాలు జరుగుతుండటంతో సీఎం కేసీఆర్తోపాటు మంత్రులు, ఇతర ముఖ్యనాయకులు, వీవీఐపీలతోపాటు భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నదని, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామన్నారు.