హైదరాబాద్, ఏప్రిల్ 12(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని విద్యుత్తు పంపిణీ సంస్థ(డిస్కమ్)లను ప్రైవేటీకరిస్తారనే ప్రచారం జరుగుతున్నదని పవర్ ఎంప్లాయీస్ జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తంచేశారు. వెంటనే ఆ ఆలోచనను విరమించుకోవాలని వారు డిమాండ్ చేశారు. పవర్ ఎంప్లాయీస్ జేఏసీ చైర్మన్ సాయిబాబా, కన్వీనర్ రత్నాకర్రావు నేతృత్వంలో జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంతో ప్రజాభవన్లో భేటీ అయ్యారు. రైతు డిస్కమ్ ఏర్పాటు ఉద్యోగుల సర్దుబాటు, 2026 పీఆర్సీ, 2004కి ముందు నియమితులైన వారికి పాత పింఛన్, రెగ్యులర్ ప్రమోషన్లు, కొత్త నియామకాలు, ఆర్టిజన్ సమస్యలపై జేఏసీ నేతలు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం స్పందిస్తూ తాము ఎట్టి పరిస్థితుల్లో డిస్కమ్లను ప్రైవేటీకరించబోమని స్పష్టం చేశారు. విద్యుత్తు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీనియర్ అధికారులతో కమిటీ వేస్తామని, ఉద్యోగ సంఘాలకు ప్రతి నెలా గంట పాటు సమయం కేటాయించేలా అధికారులను ఆదేశిస్తామని భట్టి హామీనిచ్చారు. జేఏసీ కో కన్వీనర్ బీసీరెడ్డి, నాయకులు భూపాల్రెడ్డి, సదానందం, శివశంకర్, స్వామి, రమేశ్, అశోక్, సుధాకర్రెడ్డి, నాగరాజు, సత్యనారాయణ, దయానంద్, జనప్రియ, మల్లయ్య, ప్రమోద్ తదితరులు ఈ భేటీలో పాల్గొన్నారు.