పనాజీ, ఏప్రిల్ 15: విద్యుత్తు కొరత, సరఫరాలో అంతరాయం, అప్రకటిత కరెంటు కోతలతో బీజేపీ పాలిత గోవాలో పరిశ్రమలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతున్నదని భారతీయ పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ఈ మేరకు సీఐఐ గోవా విభాగం గురువారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘కరెంటు సరఫరాలో అంతరాయం కారణంగా పరిశ్రమలు బాగా నష్టపోతున్నాయి. యంత్రాలు పాడవుతున్నాయి. ఉత్పత్తిపైనా ప్రభావం పడుతున్నది’ అని అందులో పేర్కొన్నది. కరెంటు సరఫరాలో లోపాలను అధిగమించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇందుకు పలు సూచనలు చేసింది. గతంలో చేసిన సూచనలను పట్టించుకోలేదని అసంతృప్తి వ్యక్తం చేసింది. బుధవారం గోవా విద్యుత్తు మంత్రి సుధీన్ ధవళికర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్లాగా గోవా రాష్ట్రంలో కరెంటు సమస్య లేదన్నారు. ‘ఏపీలో పరిశ్రమలు కనీసం ఐదు గంటలు కూడా నడవడం లేదు. దానికన్నా మనం చాలా బెటర్’ అని పేర్కొన్నారు.