దేశంలో లింగనిష్పత్తి మెరుగుపడిందని ఇటీవలి ‘జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే’ వెలువరించిన గణాంకాలు స్పష్టం చేస్తున్నప్పటికీ.. వాస్తవపరిస్థితులను అవి ప్రతిబింబిస్తున్నాయా అనేదే సందేహం. ఎందుకంటే, జననాలకు సంబంధించి బాలబాలికల మధ్య ఇప్పటికీ పెద్ద అగాధమే ఉన్నదని అదే సర్వే తెలిపింది. దేశంలో ప్రతీ వెయ్యి మంది బాలురకు 929 మంది బాలికలు జన్మిస్తున్నారు. అంటే, పుట్టే పిల్లల విషయంలో ఇప్పటికీ మనదేశంలోని తల్లిదండ్రులు కూతురు కంటే కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని తేటతెల్లమవుతున్నది. ఆరోగ్య సర్వేను దేశవ్యాప్తంగా 1992 నుంచీ నిర్వహిస్తున్నారు. ఈసారి జరిగింది ఐదవది. దీంట్లోభాగంగా 6,36,699 ఇండ్లలో 7,24,115 మంది స్త్రీలను, 1,01,839 మంది పురుషులను ప్రశ్నించారు. గత 30 ఏండ్లలో తొలిసారిగా లింగనిష్పత్తి మహిళల వైపు మొగ్గుచూపిందని తాజా సర్వే తెలిపింది. దేశంలో ప్రతీ వెయ్యి మంది పురుషులకు 1,020 మంది స్త్రీలు ఉన్నారని పేర్కొంది.
దేశ జనాభా, సంక్షేమ పథకాల అమలు వంటి వివరాలపై పదేండ్లకోసారి జరిగే జనగణనే సమగ్ర చిత్రాన్ని అందిస్తుంది. మధ్యలో స్వల్పస్థాయిలో జరిపే జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే మనం ఏ దిశగా పయనిస్తున్నామనేది చూచాయగా పట్టి చూపుతుంది. 2001 నాటి జనగణన ప్రకారం దేశంలో స్త్రీ, పురుష నిష్పత్తి 933:1000. తదుపరి పదేండ్లకు జరిపిన 2011 నాటి జనగణనలో ఇది కాస్త మెరుగుపడి 940:1000కి చేరుకుంది. ఇదే సమయంలో నిర్వహించిన కుటుంబ సర్వేలు భిన్న దృశ్యాన్ని ఆవిష్కరించాయి. 2005-06 సర్వే ప్రకారం స్త్రీ, పురుషులు సమానంగా ఉన్నారు. 2015-16 సర్వేలో ఇది 991:1000కి తగ్గింది. ఈ విధంగా జనగణన, కుటుంబసర్వే వివరాల మధ్య తేడాలు ఉంటున్నాయి. ఈసారి జరగాల్సిన జనగణన కరోనా కారణంగా వాయిదా పడింది. అది జరిగితే స్త్రీ పురుష నిష్పత్తి మీద పూర్తి స్పష్టత వస్తుంది.
జనాభా లెక్కల స్థాయిలో కచ్చితత్వం లేకున్నా, కుటుంబ సర్వే ప్రాధాన్యాన్ని తక్కువ చేయలేం. జనాభా నియంత్రణ మన దేశంలో ఎంతో ప్రభావవంతంగా సాగుతున్నదని ఈ సర్వేద్వారా రుజువైంది. మహిళలు ఇద్దరు పిల్లలకు మించి జన్మనివ్వటం లేదు. మరణించే తరాన్ని కొత్త తరం భర్తీ చేస్తుందని, జనాభా పెరుగుదల ఆగిపోయి స్థిరీకరింపబడుతున్నదని దీనిద్వారా అర్థమవుతున్నది. దీని ఫలితాలు మరో 20-30 ఏండ్లలో కనిపించే అవకాశం ఉంది. రెండేండ్లలోపు చిన్నారుల ఆరోగ్యం మెరుగుపడుతున్నదని, మెజారిటీ పిల్లలకు తగిన సమయంలోనే నిర్ణీత వ్యాక్సిన్లు వేస్తున్నామని వెల్లడైంది. కరోనా కారణంగా ఆరోగ్యసేవలకు కలిగిన ఇబ్బందులను, తద్వారా తలెత్తిన ఆరోగ్య సమస్యలను కూడా సర్వే ప్రస్తావించింది. కేంద్రప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి దేశ వైద్యారోగ్య వ్యవస్థను పటిష్ఠ పరచాలి.