కష్టపడి పనిచేసేవారికి అందరికంటే అధిక వేతనాలు, లాభాలు, అధిక ప్రయోజనాలు దక్కడం చూస్తుంటాం. పనిచేసే సంస్థను లేదా వ్యాపారాన్ని వృద్ధిపథంలోకి తీసుకొస్తారు కాబట్టి, అలాంటివారు మరింత కష్టపడాలని ప్రోత్సాహకాలు ఇస్తుంటారు. మరి ఒక దేశం అభివృద్ధిపథంలో దూసుకుపోయేలా చేసే రాష్ర్టాలకు కూడా అలాంటి ప్రోత్సాహం దక్కాలి కదా! కానీ మనదేశంలో నియోజకవర్గాల పునర్విభజన విధానం ఇందుకు రివర్స్లో ఉన్నది. జనాభాను నియంత్రించి, అపార సంపదను సృష్టిస్తున్న రాష్ర్టాలను మూలకు నెట్టి ఇబ్బడిముబ్బడిగా జనాభాను పెంచుతున్న రాష్ర్టాలకు దేశంపై అధికారాన్ని కట్టబెట్టే పని జరుగుతున్నది. దీంతో జాతీయ లక్ష్యాల సాధనలో నిజాయితీగా కష్టపడుతున్న దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.
హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశంలో పార్లమెంట్, రాష్ర్టాల అసెంబ్లీ స్థానాల పునర్విభజన జనాభా ప్రాతిపదికన చేపడుతుండటంతో దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది. నియోజకవర్గాల డీలిమిటేషన్ 2026 తర్వాత జరుగనున్నది. డీలిమిటేషన్ చట్టం-2002 ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనను 2026 దాకా నిలిపేశారు. లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దులను గుర్తించడానికి పదేండ్లకోసారి జనగణన ప్రాతిపదికగా డీలిమిటేషన్ ప్రక్రియ జరుగుతుంది. జనాభానే ప్రాతిపదికగా తీసుకుంటే.. జనాభా అధికంగా పెరిగిన రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్య భారీగా పెరుగనుండగా, తక్కువగా ఉండే రాష్ర్టాల్లో వాటి సంఖ్య తగ్గనున్నది.
ఉత్తరాదిలో అడ్డూ అదుపూ లేని జనాభా
దేశ సగటు జనాభా వృద్ధి రేటు 14 శాతం ఉన్నది. ఉత్తరాది రాష్ర్టాల్లో ఇది జాతీయ సగటుకంటే 4 శాతం అధికంగా ఉన్నది. దక్షిణాది రాష్ర్టాల్లో మాత్రం జాతీయ సగటుకంటే 6 నుంచి 7 శాతం తక్కువ జనాభా వృద్ధిరేటు ఉన్నది. ఈ లెక్కన 2026 తర్వాత జరుగబోయే డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ర్టాల్లో నియోజకవర్గాల సంఖ్య యథాతథంగా ఉంచేందుకు లేదా.. తగ్గించేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉత్తరాదిలో మాత్రం వీటి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
దక్షిణాది రాష్ర్టాల్లో కుటుంబ నియంత్రణను కచ్చితంగా పాటిస్తుండగా, ఉత్తరాదిలో ఆ దిశగా ప్రభుత్వాలు దృష్టి పెట్టడంలేదు. దేశంలో అధిక సంతానోత్పత్తి కలిగిన 7 రాష్ర్టాలు ఉత్తరాదికి చెందినవే. బీహార్, జార్ఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అస్సాంలో అత్యధిక సంతానోత్పత్తి రేటు ఉన్నది. దేశ జనాభాలో 28 శాతం ఈ 7 రాష్ర్టాల్లోనే ఉన్నది. ఈ రాష్ర్టాల్లోని 145 జిల్లాల్లో కుటుంబ నియంత్రణకు కేంద్రం మిషన్ పరివార్-2016 పథకాన్ని ప్రారంభించినప్పటికీ ప్రయోజనం కనిపించటంలేదు. సంతానోత్పత్తి రేటు తక్కువగా ఉన్న 10 రాష్ర్టాల్లో తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, గోవా ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజనలో ఈ రాష్ర్టాలు తీవ్రంగా నష్టపోనున్నాయి.
బడ్జెట్ రైలెప్పుడూ ఉత్తరాదిగా..
ఉత్తరాదిలో నియోజకవర్గాలు అధికంగా ఉంటే దక్షిణాదికి నష్టమేమిటనే ప్రశ్న రావచ్చు. దేశంలో జనాభాపరంగా అతిపెద్దదైన యూపీలో 80 లోక్సభ స్థానాలున్నాయి. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటుచేయాలన్నా యూపీ ఎంపీలే కీలకం. అధికారంలో ఉండేదీ వాళ్లే. దీంతో కేంద్రం పథకాలు అత్యధికం యూపీ, బీహార్, మధ్యప్రదేశ్ వంటి ఎక్కువ ఎంపీలున్న రాష్ర్టాలకే వెళ్తుంటాయి. ఇందుకు రైల్వే నెట్వర్కే ఉత్తమ ఉదాహరణ. ఉత్తరాదిలో ఉన్నంత భారీ రైల్ నెట్వర్క్ దక్షిణాదిలో లేదు. బడ్జెట్లో కొత్తరైళ్లు కూడా ఉత్తరాదికే పరుగులు పెడతాయి.