జూబ్లీహిల్స్: పిట్ట కొంచెం.. పట్టు ఘనం అని నిరూపిస్తుంది పూజ నిత్లేకర్. యూసుఫ్గూడ ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న పూజ .. రెజ్లింగ్లో అపార ప్రతిభ కనబరుస్తున్నది. ఎల్బీ స్టేడియం వేదికగా రాష్ట్ర స్థాయి పోటీల్లో పూజ పసిడి పతకంతో మెరిసింది. దీని ద్వారా ఈనెల 26 నుంచి 29 వరకు రాంచీ(జార్ఖండ్)లో జరుగనున్న జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. అంతకుముందు యూసుఫ్గూడ కోట్ల విజయభాస్కర్రెడ్డి(కేవీబీఆర్) స్టేడియంలో జరిగిన హైదరాబాద్ జిల్లా స్థాయి టోర్నీలో స్వర్ణ పతకం దక్కించుకుంది.
ఇలా పోటీపడ్డ ప్రతీ టోర్నీలో సత్తాచాటుతూ పతకాలు కొల్లగొడుతున్నది. ఎర్రగడ్డకు చెందిన పూజ..చిన్ననాటి నుంచే తన తండ్రి చంద్రకాంత్ దగ్గర రెజ్లింగ్లో ఓనమాలు దిద్దుతూ అంచలంచెలుగా ఎదిగింది. ప్రస్తుతం కేవీబీఆర్ స్టేడియంలో కోచ్ శ్రీకాంత్ యాదవ్ శిక్షణ పొందుతున్న పూజ.. జాతీయ స్థాయిలో రాణించాలన్న పట్టుదలతో ఉంది. తాను సాధించలేనిది కూతురు ద్వారా కలను సాకారం చేసుకోవాలని చంద్రకాంత్ కృత నిశ్చయంతో ఉన్నారు. రూపిందర్కు గాయం.. కెప్టెన్గా బీరేంద్ర
బెంగళూరు: ఆసియా హాకీ కప్ టోర్నీకి భారత జట్టు కెప్టెన్గా ఎంపికైన రూపిందర్పాల్ సింగ్ గాయపడ్డాడు. దీంతో మెగాటోర్నీకి అతడు దూరమవడంతో వైస్ కెప్టెన్ బీరేంద్ర లక్రాకు కెప్టెన్గా పూర్తిస్థాయి బాధ్యతలు అప్పగించారు. టోక్యో ఒలింపిక్స్ అనంతరం ఆటకు వీడ్కోలు పలికిన రూపిందర్ను హాకీ ఇండియా తిరిగి పిలుపునివ్వగా.. ప్రాక్టీస్ సమయంలో అతడు గాయపడ్డాడు. గాయంతో టోర్నీ నుంచి వైదొలుగడంతో 20 మందితో కూడిన భారత బృందానికి బీరేంద్ర సారథ్యం వహిస్తాడని హాకీ ఇండియా తెలిపింది. ఈనెల 23 నుంచి జకార్తా వేదికగా ఆసియా కప్ మొదలుకానుంది.