మేడ్చల్, జనవరి 5 (నమస్తే తెలంగాణ): చెరువుల పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలని మేడ్చల్-మల్కాజిగిరి కలెక్టర్ హరీశ్ ఆదేశించారు. బుధవారం మేడ్చల్ -మల్కాజిగిరి కలెక్టరేట్లో చెరువుల పరిరక్షణపై ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్యాక్రాంతం, కబ్జాలకు గురైన చెరువులను పరిశీలించి నివేదికలు తయారు చేయడంతో పాటు నోటీసులు జారీ చేయాలన్నారు. ఈ విషయంలో సంబంధిత శాఖల అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు. గతంలో నోటీసులు అందుకొని స్పందించని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. సమీక్షా సమావేశంలో అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఆర్వో లింగ్యానాయక్, ఆర్డీవోలు మల్లయ్య, రవి, ఇరిగేషన్, హెచ్ఎండీఏ శాఖల అధికారులు పాల్గొన్నారు.