ముంబై: వాతావరణ మార్పులను ఎన్నికల ఎజెండాగా రాజకీయ పార్టీలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. వాతావరణ మార్పు సమస్య కేవలం ముంబై లేదా మహారాష్ట్రకే పరిమితం కాదని, ప్రపంచం మొత్తానికి కీలకమైన సమస్య అని చెప్పారు. వాతావరణంలో మార్పు జరిగితే, అది ఇతర దేశాల కంటే మన దేశ ప్రజలపైనే ఎక్కువగా ప్రభావం చూపుతుందని అన్నారు. మన దేశంలో జనసాంద్రత ఎక్కువగా ఉండటమే దీనికి కారణమన్నారు.
ఈ నేపథ్యంలో రానున్న మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో వాతావరణ మార్పులపై చర్చిస్తామని మహారాష్ట్ర పర్యావరణ మంత్రి ఆదిత్య ఠాక్రే తెలిపారు. అలాగే గ్రీన్ సిలబస్ను పాఠశాల విద్యా శాఖకు అప్పగిస్తామని చెప్పారు. భూమి పచ్చదనం కోసం ఇది చాలా ముఖ్యమైన అడుగు అవుతుందని తాను ఆశిస్తున్నట్లు వెల్లడించారు.