హైదరాబాద్, ఫిబ్రవరి 27 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ దవాఖానల్లో పేదలకు నాణ్యమైన వైద్యం అందాలంటే వసతులు మెరుగుపరచడమే కాదు నిర్వహణ కూడా అవసరం. ముఖ్యంగా వైద్య పరికరాల నిర్వహణ కీలకం. రాష్ట్ర ప్రభుత్వం అన్ని స్థాయిల దవాఖానల్లో అత్యాధునిక పరికరాలను అందుబాటులోకి తెచ్చింది. అయితే కొన్ని దవాఖానల్లో పరికరాలు చిన్న పాటి మరమ్మతులకూ నోచుకోవడం లేదు. ఫలితంగా విలువైన పరికరాలు అందుబాటులోకి తెచ్చినా పేదలకు అందే సేవల్లో అంతరాయం కలుగుతున్నది. దీంతో ప్రభుత్వం వాటి నిర్వహణపై దృష్టిపెట్టింది. వైద్య పరికరాల నిర్వహణకు ప్రత్యేక పాలసీని రూపొందించింది. తాజాగా ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నూతన విధానం అమలుతో వైద్య పరికరాలు మంచి కండిషన్లో ఉంటాయి. ఏదైనా లోపం వల్ల ఆగిపోతే వెంటనే మరమ్మతులు పూర్తవుతాయి.
నూతన విధానంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానల్లో వైద్య పరికరాలను నాలుగు క్యాటగిరీలుగా విభజించారు.
క్యాటగిరీ-ఏ: 5 లక్షలకుపైగా విలువ ఉండి, వారంటీ ఉన్న పరికరాలు. సీఏఎంసీ ఇంకా ప్రారంభం కానివి.
క్యాటగిరీ-బీ: 5 లక్షలకుపైగా విలువ ఉండి, కంపెనీ మెయింటెనెన్స్ అవసరం ఉన్నవి. వారంటీ పీరియడ్ అనంతర నిర్వహణ కోసం ఒప్పందం చేసుకోవాల్సిన పరికరాలు.
క్యాటగిరీ-సీ: రూ.5 లక్షలకుపైగా విలువ, ఏడేండ్లు దాటిన పరికరాలు. వారంటీ, సీఏఎంసీ పూర్తయినా ఇంకా పనిచేస్తున్నవి.
క్యాటగిరీ-డీ: 5 లక్షల కన్నా తకువ విలువ ఉన్నవి.
ఇందులో ఏ, బీ, సీ క్యాటగిరీ పరికరాల నిర్వహణ బాధ్యతను టీఎస్ఎంఎస్ఐడీసీకి అప్పగించారు. డీ క్యాటగిరీలోని పరికరాల బాధ్యత ఆయా హాస్పిటళ్లు చూసుకొంటాయి. ముఖ్యమైన పరికరాల నిర్వహణకు సంబంధించి ఏఎంసీ, సీఎంసీ ఒప్పందాల్లో టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ భాగస్వామి అవుతారు. ఏ, బీ, సీ క్యాటగిరీలోని పరికరాలకు వారంటీకి లోబడి నిర్ణీత సమయానికి మరమ్మతులు చేయించే బాధ్యత టీఎస్ఎంఎస్ఐడీసీదే. క్యాటగిరీ-సీలోని పరికరాల నిర్వహణకు సంబంధించి మరమ్మతుల ధరలను ఖరారు చేసేందుకు కమిటీని ఏర్పాటు చేస్తారు. ఇందులో సభ్యులుగా కాళోజీ వర్సిటీ వీసీ, డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, వైద్యారోగ్యశాఖ సాంకేతిక సలహాదారు, మెంబర్ కన్వీనర్గా టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ వ్యవహరిస్తారు.
వైద్య పరికరాల నిర్వహణను పర్యవేక్షించేందుకు టీఎస్ఎంఎస్ఐడీసీలో ప్రత్యేకంగా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్ (పీఎంయూ ) పేరుతో ప్రత్యేక వ్యవస్థ నెలకొల్పుతారు. ఇందులో ఒక ప్రాజెక్టు మేనేజర్, ఒక బయోమెడికల్ ఇంజినీర్, ఇద్దరు డాటా ఎంట్రీ ఆపరేటర్లు ఉంటారు. పరికరాల నిర్వహణ సజావుగా, వేగంగా సాగేందుకు మెడికల్ ఎక్విప్మెంట్ మెయింటెనెన్స్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (ఎంఈఎంఐఎస్) పేరుతో ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ను అభివృద్ధి చేయనున్నారు. దవాఖానల సూపరింటెండెంట్లు ఈ సాఫ్ట్వేర్ సహాయంతో మరమ్మతులు, మెయింటెనెన్స్ కోసం ఆన్లైన్లో విజ్ఞప్తులు ఇవ్వాలి. పీఎంయూ యూనిట్ ఈ వినతులను పరిశీలించి, నిర్ణీత గడువులోగా పరిషరించేలా చర్యలు తీసుకుంటుంది. ఎంఈఎంఐఎస్ సాఫ్ట్వేర్ను టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ నెల రోజుల్లోగా అభివృద్ధి చేయాల్సి ఉంటుంది.
డీ క్యాటగిరీలోని పరికరాల నిర్వహణకు ప్రభుత్వం టీఎస్ఎంఎస్ఐడీసీ లేదా డీఎంఈకి నిధులు కేటాయించనున్నది. అక్కడి నుంచి దవాఖానలకు పడకల సంఖ్య ఆధారంగా నిధులు విడుదల చేస్తారు. ప్రతి పడకకు పీహెచ్సీలకు రూ.వెయ్యి, సీహెచ్సీలకు రూ.1,500, ఏహెచ్ లేదా డీహెచ్లకు రూ.2 వేలు, టీచింగ్, స్పెషాలిటీ హాస్పిటళ్లకు రూ.2,500 చొప్పున విడుదల చేస్తారు. నూతన విధానం అమలు బాధ్యతను డీఎంఈ, టీవీవీపీ కమిషనర్, టీఎస్ఎంఎస్ఐడీసీ ఎండీ, డీపీహెచ్, కుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వం అప్పగించింది.