బంజారాహిల్స్, నవంబర్ 28: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్ అలియాస్ నందును ఓ చీటింగ్ కేసులో విచారణ కోసం బంజారాహిల్స్ పోలీసులు సోమవారం కస్టడీలోకి తీసుకున్నారు. ఫిలింనగర్ రోడ్ నంబర్ 1లో సినీహీరో వెంకటేశ్కు చెందిన స్థలంపై నందకుమార్కు హక్కు లేకపోయినా లీజుకు ఇచ్చాడని, దీంతో తాము లక్షల రూపాయలు నష్టపోయామని దక్కన్ కిచెన్ హోటల్ నిర్వాహకుడు సయ్యద్ అయాజ్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీంతో నం దకుమార్పై ఐపీసీ 406, 420, 506 సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు ఎర కేసులో అరెస్టయి చంచల్గూడ జైలులో ఉన్న నందకుమార్ను కస్టడీకి ఇవ్వాలంటూ బంజారాహిల్స్ పోలీసులు వేసిన పిటిషన్ను నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో సోమవారం ఉదయం 9.30 గంటలకు జైలు నుంచి నందకుమార్ను తీసుకొచ్చిన పోలీసులు.. ఆయన న్యాయవాది నాగరాజు సమక్షంలో సాయంత్రం 3.30 వరకు ప్రశ్నించారు. దక్కన్ కిచెన్ ఏర్పాటు చేసిన స్థలంపై మీకు హక్కు ఉన్నదా? ఆ స్థలాన్ని మీరెలా లీజుకు ఇచ్చారు? అడ్వాన్సుల రూపంలో తీసుకున్న లక్షల రూపాయలు ఎవరికి వెళ్లాయి? అన్న అంశాలతోపాటు జీహెచ్ఎంసీ అనుమతులు లేకుండా ఆ స్థలంలో నిర్మాణాలను చేపట్టడంపై నిందితుడిని బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, ఇన్స్పెక్టర్ నరేందర్, ఇతర అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించినట్టు సమాచారం. అనంతరం నందకుమార్ను చంచల్గూడ జైలుకు తరలించిన పోలీసులు.. మంగళవారం కూడా ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తామని తెలిపారు.