బంజారాహిల్స్/మాదాపూర్, డిసెంబర్ 13: ప్రీ రిలీజ్ ఈవెంట్లో భాగంగా నిబంధనలు ఉల్లంఘించిన ‘పుష్ప’ చిత్ర యూనిట్పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్పై అల్లు అర్జున్ హీరోగా నిర్మించిన పుష్ప సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ను ఆదివారం సాయంత్రం యూసుఫ్గూడలోని పోలీస్ గ్రౌండ్స్లో నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని 5వేలమందితో నిర్వహిస్తామని వెస్ట్జోన్ డీసీపీ నుంచి మైత్రీ మూవీస్ సంస్థకు చెందిన కిశోర్ అనుమతి తీసుకున్నారు.
అయితే భారీగా అభిమానులు రావడంతో సమీపంలోని రోడ్లన్నీ ట్రాఫిక్తో నిండిపోయాయి. పోలీసులు సైతం అభిమానులను నియంత్రించడం లో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తోపులాటలో కొందరు బౌన్సర్ల కు, అభిమానులకు గాయాలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని ఎస్ఐ నరేశ్ ఫిర్యాదు చేయడంతో కిశోర్పై ఐపీసీ 143, 341,336,290 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
మాదాపూర్లోని ఎన్ కన్వెన్షన్ సెంటర్లో సోమవారం సాయంత్రం ‘పుష్ప’ యూనిట్ సభ్యులు ‘ఫ్యాన్స్ మీట్’ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనివార్య కారణాలతో హీరో అల్లు అర్జున్ హాజరుకాలేకపోవడంతో భారీగా తరలివచ్చిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. ఎన్ కన్వెన్షన్ గేట్ను విరగ్గొటడంతో పాటు అద్దాలను సైతం ధ్వంసం చేశారు. అభిమానులను చెదరగొట్టిన పోలీసులు.. శ్రేయాస్ మీడియా, మైత్రి మూవీస్పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.