న్యూఢిల్లీ, మే 11: ప్రభుత్వరంగ సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) లాభాలకు మొండి బకాయిల సెగ గట్టిగానే తగిలింది. నిరర్థక ఆస్తులను పూడ్చుకోవడానికి భారీగా నిధులు కేటాయించడంతో గడిచిన త్రైమాసికానికిగాను బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 66 శాతం తగ్గి రూ.202 కోట్లకు పరిమితమైంది. అంతక్రితం ఏడాది ఇది రూ.586 కోట్లుగా ఉన్నది. జనవరి-మార్చి మధ్యకాలానికిగాను బ్యాంక్ ఆదాయం రూ.21,386 కోట్ల నుంచి రూ.21,095 కోట్లకు పడిపోయింది. ఈ విషయాన్ని బ్యాంక్ బీఎస్ఈకి సమాచారం అందించింది. సమీక్షకాలంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 14.12 శాతం నుంచి 11.78 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ 5.73 శాతం నుంచి 4.8 శాతానికి దిగొచ్చింది. గత త్రైమాసికంలో మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ రూ.4,851.47 కోట్ల నిధులను వెచ్చించడంతో మొత్తం బ్యాంక్ పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపింది. మరోవైపు, రూ.2 ముఖ విలువ కలిగిన ప్రతిషేరుకు 64 పైసలు లేదా 32 శాతం డివిడెండ్ను బోర్డు సిఫారస్ చేసింది. 2021-22 ఆర్థిక సంవత్సరానికిగాను నికర లాభం రూ.2,021.62 కోట్ల నుంచి రూ.3,456.96 కోట్లకు చేరుకున్నట్లు తెలిపింది.