న్యూఢిల్లీ, నవంబర్ 3: పండుగ సీజన్ దృష్ట్యా ఖాతాదారులకు పలు ఆఫర్లను ప్రకటించింది పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ). ఈ పండుగ సీజన్లో రిటైల్ రుణాలను తక్కు వ వడ్డీకే అందిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. వాహన రుణాలు 6.65 శాతం వడ్డీకే అందిస్తుండగా, గృహ రుణాలపై వడ్డీని 6.50 శాతానికి తగ్గించింది. అలాగే విద్యుత్తు వాహనాల వాడకం పెంచడానికి కేంద్రం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ-వాహనాలు, సీఎన్జీ వాహనాలపై వడ్డీని 6.65 శాతానికి తగ్గించిన బ్యాంక్.. ఇతర వాహనాలపై 6.75 శాతం ప్రారంభ వడ్డీని ఆఫర్ చేస్తున్నది. అలాగే వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటును 5 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రేటు 8.90 శాతానికి దిగొచ్చింది. 72 నెలల్లో చెల్లింపులు జరిపేలా రూ.20 లక్షల లోపు రుణానికి ఈ వడ్డీరేటు వర్తించనున్నది. డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ప్రోత్సహించేలా తమ మొబైల్ యాప్ ద్వారా గృహ రుణాన్ని తీసుకున్నవారికి 5 బేసి స్ పాయింట్లు రాయితీ ఇస్తున్నట్లు తెలిపింది. వాహన రుణాలపై 10 బేసిస్ పాయింట్లు డిస్కౌంట్ ఉన్నది. అన్ని రకాల రుణాలపై ప్రాసెసింగ్ ఫీజును ఎత్తివేస్తున్నట్లూ ప్రకటించింది. మరోవైపు బీఎల్ఆర్ని 5 బేసిస్ పాయింట్లు తగ్గించింది. దీంతో రుణ రేటు 6.50 శాతానికి తగ్గింది. అలాగే ఆర్ఎల్ఎల్ఆర్ని కూడా 5 బేసిస్ పాయింట్లు కోత విధించడంతో రుణ రేటు 6.50 శాతానికి దిగొచ్చింది. తగ్గించిన ఈ రేట్లు ఈ నెల 8 నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ వెల్లడించింది.