ఉక్రెయిన్లోని ఖర్కీవ్పై రష్యా చేస్తున్న కాల్పుల్లో మృతి చెందిన నవీన్ కుటుంబీకులతో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడారు. వారి కుటుంబీకులకు సానుభూతి వ్యక్తం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశం మొత్తం వారితో ఉంటుందని ప్రధాని భరోసా ఇచ్చారు. అంతకు ముందు కర్నాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై కూడా నవీన్ కుటుంబీకులతో మాట్లాడారు. విచారం వ్యక్తం చేశారు. నవీన్ మృతదేహాన్ని కర్నాటకకు తీసుకొచ్చే విషయంపై విదేశాంగ మంత్రిత్వ శాఖతో మాట్లాడుతున్నామని, అతి తొందర్లోనే నవీన్ మృతదేహం స్వస్థలానికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామని సీఎం బొమ్మై కుటుంబీకులకు హామీ ఇచ్చారు.
ఉక్రెయిన్లోని ఖర్కీవ్పై రష్యా చేస్తున్న కాల్పుల్లో భారతీయ విద్యార్థి ఒకరు మృతి చెందారు. మృతుడు కర్నాటకకు చెందిన నవీన్గా గుర్తించారు. నవీన్ ఉక్రెయిన్లో వైద్య విద్యను అభ్యస్తిస్తున్నాడు. ఈ మృతిని భారత విదేశాంగ శాఖ కూడా ధృవీకరించింది. నవీన్ కుటుంబీకులతో తాము సంప్రదింపులు జరుపుతున్నామని భారత విదేశాంగ శాఖ పేర్కొంది.
‘ఖార్కివ్లో జరిగిన కాల్పుల్లో భారతీయ విద్యార్ధి ఈ ఉదయం మృతి చెందాడు. తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నాం. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. మంత్రివర్గ సభ్యులు నవీన్ కుటుంబంతో టచ్లోనే ఉన్నారు. రష్యా, ఉక్రెయిన్ రాయబారులతో విదేశాంగ శాఖ కార్యదర్శి మాట్లాడుతున్నారు. భారతీయులందర్నీ సురక్షితంగా తరలించాలని డిమాండ్ చేస్తున్నారు. అలాగే ఈ రెండు దేశాల్లోని రాయబారులు కూడా ఇదే పనిలో నిమగ్నమయ్యారు’ అంటూ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చీ ట్వీట్ చేశారు.