న్యూఢిల్లీ, అక్టోబర్ 23: రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ‘ఉచిత’ పథకాలు ప్రకటించటంపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. టాక్స్పేయర్స్ (పన్నులు కట్టేవాళ్లు) చెల్లించిన పన్నుల సొమ్మును ఉచిత పథకాలకు ఖర్చు పెట్టడంపై వారంతా ఎంతో ఆవేదన చెందుతున్నారని అన్నారు. తమ ప్రభుత్వం పన్నుల సొమ్మును ప్రజల సంక్షేమంకోసం ఖర్చు చేస్తుండటంతో కోట్లమంది పన్ను చెల్లింపుదారులు ఎంతో సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. పీఎం ఆవాస్ యోజన పథకం లబ్ధిదారులను ఉద్దేశించి ప్రధాని ఆదివారం వర్చువల్గా ప్రసంగించారు. ‘పన్నుల సొమ్మును సరైన విధానంలో (ప్రభుత్వాలు) ఖర్చుపెడితే పన్ను చెల్లింపుదారులంతా ఎంతో సంతోషిస్తారు. మరింత ఎక్కువ పన్నులు చెల్లించేందుకు ముందుకొస్తారు. కరోనా కష్టసమయంలో కోట్లమందికి (మా ప్రభుత్వం) తిండిపెట్టినందుకు కోట్లమంది పన్ను చెల్లింపుదారులు ఎంతో సంతోషంగా ఉన్నారు. ఉచితాల పేరుతో పన్నుల సొమ్మును (ప్రతిపక్ష ప్రభుత్వాలు) పంచిపెడుతుండటంతో ఇదే ట్యాక్స్పేయర్స్ ఎంతో బాధపడుతున్నారు’ అని వ్యాఖ్యానించారు.
ట్యాక్స్పేయర్స్ కానిదెవరు?
ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు అధికారంలో ఉన్న చోట పేదలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ‘ఉచితాలు’, ‘తాయిలాలు’ అంటూ ప్రధాని మోదీ ఇటీవల తరచుగా మాట్లాడుతున్నారు. ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రారంభించిన గృహాలు కూడా పేదలకు ఉచితంగా కట్టించి ఇచ్చినవే. బీజేపీ పాలిత రాష్ర్టాల్లో కూడా ఉచిత పథకాలు ఉన్నాయని ఇటీవల ప్రతిపక్షాలు ఎదురుదాడి మొదలుపెట్టడంతో ఆయన ట్యాక్స్ పేయర్స్ అంటూ కొత్తరాగం ఎత్తుకొని పేదలు, ఉన్నత వర్గాలను విడదీసే ప్రయోగం మొదలుపెట్టారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. అసలు మనదేశంలో ట్యాక్స్ పేయర్ కానిది ఎవరు? అని ఆర్థికవేత్తలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్ ట్యాక్స్ కట్టేవాళ్లే పన్నుచెల్లింపుదారులా? మోదీ సర్కారు భారీగా పెంచిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్పై పన్నులు చెల్లిస్తున్నవారే పన్ను చెల్లింపుదారులా? ఏటా ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న ఉద్యోగులు, చిన్న వ్యాపారులే పన్ను చెల్లింపుదారులా? ఇతర ప్రజలంతా పన్ను చెల్లింపుదారులు కాదా? అని నిలదీస్తున్నారు. నిజానికి దేశంలో మూడుపూటలా తిండి తినే ప్రతి పౌరుడూ పన్ను చెల్లింపుదారుడేనని అంటున్నారు. సబ్బు, పేస్టులు, చివరకు ఉప్పు కొన్నా పన్ను చెల్లించినట్టేనని, అలాంటప్పుడు పన్నుచెల్లింపుదారులు అని ప్రధాని ప్రత్యేకంగా ఎవరిని ఉద్దేశించి మాట్లాడారని ప్రశ్నిస్తున్నారు.
మొదటి నుంచీ ధనవంతుల పక్షమే
బీజేపీకి ధనవంతుల పార్టీ అని మొదటి నుంచీ పేరున్న విషయం తెలిసిందే. ఆ పార్టీకి దేశంలోని సంపన్నులు, కార్పొరేట్లు, వ్యాపారవర్గాలే ఎక్కువగా మద్దతుగా నిలుస్తాయి. బీజేపీ విధానాలు కూడా వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొనే ఉంటాయి. తాజాగా ప్రధాని మోదీ మాట్లాడిన పన్ను చెల్లింపుదారులు అంటే.. ఆయన దృష్టిలో ఈ సంపన్న వర్గాలేనని ఆర్థికవేత్తలు అంటున్నారు. మరి వీరంతా ఎలా సంపన్నులయ్యారు? లక్షలమంది కార్మికులు, కర్షకులు చమటోడిస్తే వచ్చిన సంపదలో అధికభాగం తీసుకోవటం వల్లనే సంపన్నులయ్యారు కదా అని ఉదహరిస్తున్నారు. అంటే సంపద సృష్టికి మూలం కష్టజీవులే కదా? అని పేర్కొంటున్నారు. ఈ ఏడాది మార్చి 31 నాటికి వసూలైన మొత్తం 27.07 లక్షల కోట్ల పన్నుల్లో ప్రత్యక్ష పన్నులు రూ.14.10 లక్షల కోట్లు ఉండగా, పరోక్ష పన్నులు రూ.12.90 లక్షల కోట్లు ఉన్నాయి. ప్రత్యక్ష పన్నులు అంటే ఉద్యోగులు, వ్యాపారులు, కార్పొరేట్ కుబేరులు, ఇతర ధనవంతులు కట్టే పన్నులు. పరోక్ష పన్నులు అంటే ఈ దేశంలో విక్రయించే ప్రతి వస్తువుపై ప్రభుత్వం వసూలు చేసే పన్ను. నిజానికి ప్రత్యక్ష పన్నులు చెల్లించేవారు దేశంలో 10 శాతానికి మించరు. వారు ఏడాదికి ఒకసారే పన్నులు కడతారు. మిగతా 90 శాతం మంది సామాన్యులు నిత్యం పన్నులు కడుతూనే ఉంటారు. నిత్యజీవితం అవసరమయ్యే ప్రతి వస్తువుపై పన్ను కట్టినట్టే. చివరకు కూరగాయలపై కూడా పన్ను కడుతున్నట్టేనని చెప్తున్నారు. వాస్తవం ఇలా ఉంటే ప్రధాని 90 శాతం సామాన్యులను శత్రువుల్లా చూస్తూ, 10 శాతం మంది ధనవంతుల తరఫున మాట్లాడుతున్నారని విమర్శిస్తున్నారు. ఇందులో ఇంకో విషయం ఏమిటంటే ఈ 10 శాతం మంది సంపన్నులు కట్టే పన్నుల్లో నుంచి వారి కోసం కూడా ప్రభుత్వాలు ఖర్చు పెడుతూనే ఉన్నాయి. వారి పిల్లల చదువులకు, రోడ్లు వేసేందుకు, ఇతర మౌలిక వసతులు కల్పించేందుకు ప్రభుత్వాలు ఖర్చు చేస్తూనే ఉన్నాయని పేర్కొంటున్నారు.
బీజేపీ ఉచితాల మాటేమిటి?
ప్రతిపక్ష ప్రభుత్వాలు పేదలకోసం చేపట్టే సంక్షేమ పథకాలను ఉచితాలని బీజేపీ నేతలు, ప్రధాని మోదీ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ, ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కూడా అంతకుమించి ఉచిత హామీలిస్తున్నది. మొన్నటికి మొన్న గుజరాత్లో విద్యాశాఖ మంత్రి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రతి కుటుంబానికి ఏటా రెండు వంటగ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. మధ్యప్రదేశ్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఓటేస్తే ఇంటికి ఒక ఆవును ఉచితంగా ఇస్తామని బీజేపీ గతంలో హామీ ఇచ్చిన విషయాన్ని రాజకీయ పండితులు గుర్తుచేస్తున్నారు.
రాజ్యాంగ మౌలిక సూత్రమే సంక్షేమ రాజ్యం
ప్రజా సంక్షేమ పథకాలను ప్రధాని నరేంద్రమోదీ ఉచితాలని సంబోధించటం ద్వారా తాను పేదల వ్యతిరేకినని చెప్పకనే చెప్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. నిజానికి భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాల్లో అతి ప్రధానమైనది ‘సంక్షేమ రాజ్య భావన’. రాజ్యాంగంలోని నాలుగో భాగంలో ఆర్టికల్ 36 నుంచి 51 వరకు ప్రజల కోసం ప్రభుత్వం ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలో స్పష్టంగా చెప్పబడింది. ‘ప్రజలందరికీ ప్రభుత్వం జీవనోపాధి కల్పించాలి. దేశంలోని వనరులను అందరికీ సమానంగా అందేలా చూడాలి. సంపద కొందరి చేతుల్లోనే పోగు పడకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. కార్మికుల ఆరోగ్యం కాపాడాలి. బాలబాలికలను బలవంతంగా పనిచేయించటాన్ని నిరోధించాలి’ అని ఆర్టికల్ 39 స్పష్టంగా చెప్తున్నది. ఈ మౌలిక సూత్రాలలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒక్కదానిని కూడా నెరవేర్చకపోవటమే కాకుండా, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని రాజ్యాంగ పండితులు మండిపడుతున్నారు.
తేడా కొడుతున్న మోదీ వ్యవహారం
కొద్ది నెలల్లో కీలక రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు ఉండటం, ఆ తర్వాత పార్లమెంటు ఎన్నికలు వస్తుండటంతో ప్రధాని నరేంద్రమోదీ మాటల్లో ఏదో తేడా కనిపిస్తున్నదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని 2014లో అధికారంలోకి వచ్చి, ఇంతకాలం ఆ హామీని మర్చిపోయిన ప్రధాని.. తీరా ఇప్పుడు ఉద్యోగాలివ్వలేమని చేతులెత్తేశారు. నిరుద్యోగ సమస్య వందరోజుల్లో పరిష్కారమయ్యేది కాదని శనివారం ఆయన వ్యాఖ్యానించారు. ఆ మరుసటిరోజే ట్యాక్స్ పేయర్స్, సోమరిగా తినే జనం అన్న అర్ధం వచ్చేలా మాట్లాడారు. మోదీ ఈ వ్యాఖ్యలు దేశంలో ఆర్థిక వ్యవస్థ అసాధారణ ప్రమాదంలో ఉన్నదన్న సంకేతాలిస్తున్నాయని ఆర్థికవేత్తలు అంటున్నారు. ‘పరిస్థితిని చక్కదిద్దలేనప్పుడు నెపాన్ని పక్కవాడిమీద తోసేయటమే’ అన్న సూత్రాన్ని మోదీ అనుసరిస్తున్నారని అనుమానిస్తున్నారు.
ఆ పది శాతం మందే ట్యాక్స్ పేయర్సా?
బీజేపీ చెప్తున్న ట్యాక్స్పేయర్స్ అంటే ప్రత్యక్ష పన్నులు కట్టేవాళ్లు. కానీ, దేశంలో ప్రతి వ్యక్తి పన్ను కడుతున్నాడు. ప్రధాని ధనవంతుల పక్షాన మాట్లాడుతున్నారు. మరి పేదలు కడుతున్న పన్నుల గురించి ఎవరు మాట్లాడుతారు? ఇది మోసపూరిత విధానం. దేశంలో 95% మంది సృష్టిస్తున్న సంపదలో అత్యధిక భాగం 5 శాతం ధనవంతులే తీసుకొంటున్నారు. కార్పొట్లకు లక్షల కోట్ల రూపాయల రైటాఫ్లు (మాఫీలు) చేస్తున్నారు. మరి ఇవి ఉచితాలు కావా?
– డీ పాపారావు, ఆర్థికవేత్త