న్యూఢిల్లీ : యూపీ కుషీనగర్లో నిర్మించిన అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఈ నెల 20న జాతికి అంకితం చేస్తారని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ సోమవారం తెలిపింది. దీంతో బౌద్ధ యాత్రికుల ప్రయాణం సులభతరమవుతుందని పేర్కొంది. శ్రీలంకలోని కొలంబో వచ్చే తొలి అంతర్జాతీయ విమానానికి కుషినగర్ ఎయిర్పోర్ట్ స్వాగతం పలుకనున్నది. ఈ విమానంలో 125 ప్రముఖులతో పాటు బౌద్ధ సన్యాసులు రానున్నారని మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో పేర్కొన్నది. కుషినగర్ అంతర్జాతీయంగా బౌద్ధులకు తీర్థయాత్ర కేంద్రం. ఇక్కడ గౌతమ బుద్ధుడు మహా పరినిర్వాణాన్ని పొందాడు. విమానాశ్రయం ప్రారంభోత్సవం తర్వాత ప్రధాని మహా పరినిర్వాణ స్తూపాన్ని శ్రీలంక బౌద్ధ సన్యాసులు, మంత్రులతో కలిసి సందర్శిస్తారు. అనంతరం జరిగే కార్యక్రమంలో ప్రసంగిస్తారని మంత్రిత్వ శాఖ పేర్కొంది.