గాంధీనగర్: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆహార సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో చర్చించినట్లు ప్రధాని మోదీ తెలిపారు. అవసరం అనుకుంటే ప్రపంచ దేశాలకు తిండి గింజలు అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు బైడెన్తో చెప్పినట్లు మోదీ తెలిపారు. గుజరాత్లోని శ్రీ అన్నాపూర్ణా ధామ్ను ఇవాళ ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఒకవేళ ప్రపంచ వాణిజ్య సంస్థ అంగీకరిస్తే అప్పుడు భారత్ ప్రపంచదేశాలకు భోజనం అందిస్తుందన్నారు. ఉక్రెయిన్లో యుద్ధం వల్ల చాలా దేశాల్లో ఆహార నిల్వలు అడుగంటాయని, ప్రపంచం కొత్త సమస్యను ఎదుర్కొంటోందని, జో బైడెన్తో మాట్లాడుతున్న సమయంలో ఈ అంశాన్ని ఆయన కూడా ప్రస్తావించారని, ఒకవేళ డబ్ల్యూటీవో పర్మిషన్ ఇస్తే, రేపటి నుంచే ప్రపంచ దేశాలకు ఆహారం సరఫరా చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. భారత ప్రజలకు కావాల్సినంత ఆహారం దేశంలో పుష్కలంగా ఉందని, కానీ దేశ రైతులు ప్రపంచానికి సరిపడా ఆహారాన్ని పండిస్తున్నారని మోదీ అన్నారు. అయితే ప్రపంచ చట్టాల ప్రకారం పని చేయాల్సి వస్తోందని, డబ్ల్యూటీవో ఎప్పుడు ఆ అనుమతి ఇస్తుందో తెలియదని, అప్పుడు ప్రపంచ దేశాలకు తాము ఫుడ్ సప్లయ్ చేస్తామన్నారు.