హైదరాబాద్, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి సిటిజన్ అసిస్టెన్స్ అండ్ రిలీఫ్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ (పీఎం కేర్స్) ఫండ్ గందరగోళానికి కేంద్రంగా మారింది. 2020లో కరోనా మొదటి వేవ్ సమయంలో ప్రధాని మోదీ ఈ నిధిని ప్రారంభించగా, అప్పటినుంచే ఇది వివాదాల్లో చిక్కుకున్నది. దీనికి ఎంత డబ్బు వస్తున్నది.. ఎంత ఖర్చవుతున్నది అనేది అంతుచిక్కని వ్యవహారంగా మారింది. పీఎం కేర్స్ వెబ్సైట్లో ఇటీవల పొందుపరిచిన ఆడిటింగ్ నివేదిక అనేక అనుమానాలకు తావిస్తున్నదని ప్రముఖ ఆర్టీఐ కార్యకర్త కమాండర్ లోకేశ్ బాత్రా ఆరోపించారు. పీఎం కేర్స్ గురించి మొదటి నుంచీ వివిధ మార్గాల్లో వివరాలు సేకరిస్తున్న వారిలో ఆయన ఒకరు. పీఎం కేర్స్పై ఇచ్చిన ఆడిట్ నివేదికకు, పలు సందర్భాల్లో పీఐబీ (ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) ద్వారా, ఆర్టీఐ సమాధానాల రూపంలో కేంద్రం ఇచ్చిన సమాచారానికి మధ్య పొంతన కుదరడంలేదని ఆయన తెలిపారు. ‘కొవిడ్పై పోరాడేందుకు పీఎం కేర్స్ ఫండ్ నుంచి రూ.3,100 కోట్లు ఖర్చు చేయాలని ట్రస్ట్ నిర్ణయించింది. ఈ నిధులను అత్యవసర ఖర్చులకు వినియోగిస్తారు’ అని 2020 మే 13న పీఐబీ ద్వారా సమాచారం ఇచ్చారని గుర్తు చేశారు. ఈ నిధులతో వెంటిలేటర్లు, వ్యాక్సిన్లు, ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్లు వంటివి కొనుగోలు చేశారని చెప్పారు. వీటికి సంబంధించి లెక్కల్లో వ్యత్యాసాలపై లోకేశ్ బాత్రా చెప్పిన వివరాలు..
పీఐబీ: రూ.3,100 కోట్లలో దాదాపు రూ.2వేల కోట్లతో 50వేల ‘మేకిన్ ఇండియా’ వెంటిలేటర్లు కొనుగోలు చేయనున్నారు. వీటిని దేశవ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు పంపిణీ చేస్తారు.
బాత్రా ఆరోపణ: ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 50 వేల వెంటిలేటర్ల కొనుగోలుకు చేసిన ఖర్చు రూ.1311 కోట్లు. కానీ కేంద్ర ఆరోగ్యశాఖ 2021 జూలై 9న ఆర్టీఐకి ఇచ్చిన సమాధానంలో 50 వేల వెంటిలేటర్ల కొనుగోలుకు రూ.2,147.20 కోట్లు అయ్యింది. ఇందులో బీఈఎల్కు రూ.1,497 కోట్లు, హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్కు రూ.35.36 కోట్లు చెల్లించారు.
ఆడిట్ నివేదిక: 6.6 కోట్ల డోసుల కొవిడ్ వ్యాక్సిన్ కొనుగోలుకు కేంద్రం రూ.1,393 కోట్లు ఖర్చు చేసింది.
బాత్రా ఆరోపణ: ఆర్టీఐకి ఇచ్చిన సమాచారం ప్రకారం 6.6 కోట్ల వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.1485.74 కోట్లు ఖర్చయ్యింది. పీఎం కేర్స్ ద్వారా సీరం ఇన్స్టిట్యూట్ నుంచి కొవిషీల్డ్ను ఒక్కో డోసు రూ.210కి, భారత్ బయోటెక్ నుంచి కొవాగ్జిన్ ఒక్కో డోసు రూ.309.75కి కొనుగోలు చేస్తున్నట్టు చెప్పింది. కానీ బడ్జెట్లో కేంద్రం ఒక్కో డోసు రూ.157.50 చొప్పున (10 కోట్ల కొవిషీల్డ్, 2 కోట్ల కొవాగ్జిన్) కొనుగోలు చేస్తున్నట్టు చెప్పింది. ఇందులో ఏది నిజం?
ఆడిట్: దవాఖానల్లో 162 పీఎస్ఏ (ప్రెషర్ స్వింగ్ అబ్సార్షన్) ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు రూ.201.58 కోట్లు వ్యయం చేశారు.
బాత్రా ఆరోపణ: కేంద్ర వైద్యారోగ్యశాఖ 2021 జూన్ 6న ఇచ్చిన ఆర్టీఐ సమాధానంలో రూ.201.56 కోట్లు వచ్చాయని, ఇందులో ప్లాంట్ల నిర్వహణకు రూ.54.96 కోట్లు కేటాయించారని పేర్కొన్నది. మొత్తంగా రూ.141.75 కోట్లను ప్లాంట్ల ఏర్పాటుకు కేటాయించగా, రూ.63.86 కోట్లు ఖర్చు చేసినట్టు వెల్లడించింది.
ఆడిట్: బయోటెక్నాలజీ విభాగం కింద ఉన్న రెండు ల్యాబ్లను సెంట్రల్ డ్రగ్ ల్యాబొరేటరీలుగా మార్చేందుకు రూ.20 కోట్లు కేటాయించారు.
బాత్రా ఆరోపణ: బయోటెక్నాలజీ ఇండస్ట్రీ రిసెర్చ్ అసిస్టెన్స్ కౌన్సిల్ (బీఐఆర్ఏసీ) ఇచ్చిన ఆర్టీఐ సమాధానంలో పీఎం కేర్స్ నుంచి ఎలాంటి నిధులు రాలేదని స్పష్టం చేసింది. డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (డీబీటీ) మాత్రం పీఎం కేర్స్ నుంచి నిధులు రావడంపై స్పష్టత ఇవ్వడం లేదు. మరి డీబీటీ పరిధిలోని రెండు ల్యాబ్లను అప్గ్రేడ్ చేసేందుకు ఇచ్చిన నిధుల్లో కేంద్రం డీబీటీని కావాలనే పక్కన పెట్టిందా? వ్యాక్సిన్ తయారీదారులకు ప్రోత్సాహకంగా పీఎం కేర్స్ నుంచి రూ.100 కోట్లు ఇస్తున్నట్టు, వీటిని ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పర్యవేక్షణలో వినియోగిస్తారని 2020 మే 13న పీఐబీ ద్వారా సమాచారం ఇచ్చారు. ప్రజల నుంచి సేకరించిన డబ్బును ప్రైవేట్ సంస్థలకు ఎలా ఇస్తారు?
ఆడిట్ రిపోర్ట్: పీఎం కేర్స్ నుంచి కేటాయించిన నిధుల్లో ఖర్చు చేయని డబ్బు వడ్డీతో కలిసి ఎన్డీఎంఏ నుంచి రిఫండ్గా వచ్చినవి రూ.25,03,122.
బాత్రా ఆరోపణ: అసలు ఏమిటీ ఎన్డీఎంఏ ఫండ్? ఇది ప్రభుత్వ నిధా? లేదా స్వచ్ఛంద సంస్థకు చెందిందా? ఎన్డీఎంఐ నుంచి పీఎం కేర్స్కు నిధులు ఎందుకు వచ్చాయి? దీనికి సంబంధించి ఏదైనా నోటిఫికేషన్ ఇచ్చారా? ఆడిట్ రిపోర్ట్లోకి ఈ ఫండ్ ఎలా వచ్చింది?