నాడు ఎక్కడ చూసినా చెత్త
నేడు ఆ చెత్తను దాచే డంపింగ్ షెడ్లు
నాడు రోడ్లపైనే మురికి నీరు
నేడు ఇంటింటికీ ఇంకుడుగుంత
నాడు ఎక్కడచూసినా దోమలు
నేడు దోమల్లేవ్.. దాంతో రోగాల్లేవ్
నాడు తాగిన నీళ్లన్నీ కలుషితం
నేడు తాగేవన్నీ మిషన్ భగీరథ నీళ్లు
ఇవి పల్లెప్రగతి సాధించిన ఘనతలు!
ఇవే ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు!!
పల్లె ప్రగతితో పల్లెలన్నీ పచ్చగా, ఆరోగ్యంగా, సుభిక్షంగా మారాయి.
హైదరాబాద్, జనవరి 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని పల్లెల్లో సీజనల్, అంటు వ్యాధులు తగ్గుముఖం పట్టాయి. ఏటా వేల సంఖ్యలో నమోదయ్యే సీజనల్ వ్యాధుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2015తో పోలిస్తే 2021లో మలేరియా కేసులు 95 శాతం తగ్గగా, అతిసారం కేసులు 80 శాతం, టైఫాయిడ్ కేసులు 60 శాతం తగ్గాయి. రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన పల్లె ప్రగతి కార్యక్రమం ఫలితంగానే వ్యాధులు తగ్గాయని విశ్లేషకులు అంటున్నారు.
పల్లెప్రగతి ద్వారా చేపట్టిన పారిశుద్ధ్యం, మిషన్ భగీరథ నీరు, మొక్కల పెంపుదల ఫలితంగా సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడుతున్న వారి సంఖ్య తగ్గినట్టు చెప్తున్నారు. గ్రామాలు చెత్త రహితంగా ఉండేందుకు చెత్తను ప్రతి రోజూ సేకరించడం, రోడ్లపై కనిపించకుండా చేయడం, సేకరించిన చెత్తను డంపింగ్ షెడ్లలో తడి, పొడి చెత్తగా వేరు చేయడం, ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్, ట్రాలీ, ట్యాంకర్ను రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలుచేసింది.
రోడ్లపైకి మురుగునీరు, వర్షపు నీరు రాకుండా చర్యలు, సక్రమ మురుగు నీటి నిర్వహణకు ఇంటింటికీ ఇంకుడుగుంతలతో పాటు మంచి నీటి ట్యాంకులు, మురుగు కాలువల చివరన, గ్రామంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాల్లో కమ్యూనిటీ ఇంకుడు గుంతలను నిర్మించారు. దీంతో గ్రామంలో దోమలు లేకుండాపోయాయి. ఫలితంగా సగం జబ్బులు తగ్గిపోయాయి. మిషన్ భగీరథ ద్వారా శుద్ధి చేసిన నీటిని ఇంటింటికీ అందిస్తుండటంతో సీజనల్, అంటువ్యాధులు తగ్గాయని అంటున్నారు. గతంలో కలుషిత నీటి ద్వారా అతిసార వ్యాధులు వచ్చేవి. రాష్ట్రంలో 2015లో 11,880 మలేరియా కేసులు నమోదుకాగా, 2021లో 643 కేసులు మాత్రమే నమోదయ్యాయని లెక్కలు చెప్తున్నాయి.
గ్రామాల్లో జబ్బులు తగ్గాయి
గ్రామాల్లో వ్యాధులకు ప్రధాన కారణం అపరిశుభ్రత, మురుగునీరు, కలుషిత తాగునీరు. పల్లె ప్రగతి ద్వారా ఈ మూడు సమస్యలు పరిష్కారమయ్యాయి. పెద్ద ఎత్తున మొక్కలు పెంచడం ద్వారా గ్రామాల్లో ఆక్సిజన్ లభ్యత ఎక్కువైంది. ప్రజలు ఆహ్లాదకర వాతావరణంలో ఉంటున్నారు.