హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, ప్రైవేట్ ఉద్యోగుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గంధం రాములు కోరారు. తన పుట్టిన రోజు సందర్భంగా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్కుమార్ నిర్వహిస్తున్న గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా జూబ్లీహిల్స్లోని జీహెచ్ఎంసీ పార్క్లో ఉద్యోగులతో కలిసి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడం సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటడం చాలా ఆనందంగా ఉందని ఆయన వెల్లడించారు. మూడు సంవత్సరాల నుంచి పుట్టినరోజున మొక్కలు నాటుతున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు దండుగుల రామకృష్ణ, రాష్ట్ర కార్యదర్శి వేముల భాస్కర్, సోషల్ మీడియా ఇన్చార్జి మోహన్ నాయక్, బీఆర్ఎస్ నాయకులు, ప్రైవేటు ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు.