హైదరాబాద్, జనవరి 29 : రైల్వే రిక్రూట్మెంట్ పరీక్షల విధానాన్ని సమూలంగా ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ పరీక్షలను జోనల్ స్థాయిలో, ప్రాంతీయ భాషల్లోనే నిర్వహించాలని కోరారు. ఏ రాష్ర్టానికి ఆ రాష్ట్ర భాషలోనే పరీక్షలు పెట్టాలని విజ్ఞప్తిచేశారు. ఈ మేరకు శనివారం ఆయన రైల్వేశాఖ మంత్రి అశ్వినీవైష్ణవ్కు లేఖ రాశారు. క్లర్, అంతకు కింది స్థాయి పోస్టులకు జాతీయ స్థాయిలో పరీక్షలు నిర్వహించడాన్ని తప్పుబట్టారు. దీనివల్ల బీహార్, యుపీ రాష్ట్రాలదే పెత్తనం సాగుతున్నదని, ప్రాంతీయ భాషా రాష్ట్రాల అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఉత్తరాదిలో కోచింగ్ సెంటర్లు మాఫియా లాగా పని చేస్తున్నాయని, వాటి మాయాజాలం వల్ల తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు ఉద్యోగావకాశాలు రావడం లేదని పేర్కొన్నారు. 35 వేల రైల్వే పోస్టులకు కోటీ 30 వేల మంది దరఖాస్తు చేశారని వివరించారు. రైల్వే రిక్రూట్మెంట్ వ్యవహారంలో బీహార్లో అల్లర్లు, విధ్వంసాలు చెలరేగి, బంద్ వరకు వెళ్లడం తనను తీవ్రంగా కలిచి వేసిందని పేర్కొన్నారు. రైల్వే ఉద్యోగ నియామకాల అంశంపై రైల్వే మాజ్దూర్ యూనియన్, మాజ్దూర్సంఘ్, రైల్వేమెన్ ఫెడరేషన్, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తనదో మాట్లాడారని వినోద్కుమార్ తెలిపారు. రైల్వే రిక్రూట్మెంట్ విధానాన్ని తప్పుబడుతూ పార్లమెంటులో పలుమార్లు ప్రస్తావించానని వినోద్కుమార్ గుర్తుచేశారు.