హైదరాబాద్, నవంబర్ 22(నమస్తే తెలంగాణ):వ్యవసాయ విశ్వవిద్యాలయం వేదికగా ఈ నెల 23 నుంచి 27 వరకు ఐదో అంతర్జాతీయ అగ్రానమి కాంగ్రెస్ నిర్వహిస్తున్నట్టు యూనివర్సిటీ వీసీ ప్రవీణ్రావు తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ అగ్రానమీ, పీజేటీఎస్ఏయూ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ సదస్సులో పోషకాహారాన్ని అందుబాటులోకి తేవడంలో ఎదురువుతున్న, సవాళ్లు వాటి పరిష్కారాలపై చర్చించనున్నట్టు వివరించారు. సమావేశాల వివరాలను సైఫాబాద్ కమ్యూనిటీ సైన్స్ కళాశాలలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన వెల్లడించారు.
ఈ అంతర్జాతీయ సదస్సులో సుమారు 1300 మంది జాతీ య, అంతర్జాతీయ శాస్త్రవేత్తలు, అశోక్ దళ్వాయి, త్రిలోచన మహాపాత్ర, పంజాబ్సింగ్ వంటి అనేకమంది నిష్ణాతులు పాల్గొంటారని వివరించారు. వాతావరణ మార్పుని తట్టుకునే వంగడాల రూపకల్పన , సమీకృత వ్యవసాయ పద్ధతులు, స్మార్ట్ మెకనైజేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, బిగ్ డాటా, ప్రెసిషన్ ఫార్మింగ్, నూతన జాతీయ విద్యావిధానం నేపథ్యంలో వ్యవసాయవిద్య వంటి 13 ప్రధాన అంశాలపై లోతుగా చర్చించనున్నట్టు ప్రవీణ్రావు తెలిపారు.