చిక్కడపల్లి, జనవరి 3: మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమంతో రాష్ట్రంలోని మాదిగలకు న్యాయం జరుగదని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ మాదిగ సంక్షేమ సంఘం 3వ ఆవిర్భావ సభలో ఎమ్మెల్యే రాజయ్య, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి పాల్గొని డైరీని ఆవిష్కరించారు. ఎస్సీ వర్గీకరణ చేయాలని సీఎం కేసీఆర్ అసెంబ్లీలో బిల్లు ఆమోదించి కేంద్రానికి పంపించారని గుర్తుచేశారు. పిడమర్తి రవి మాట్లాడుతూ.. మందకృష్ణ మాదిగ సుదీర్ఘ ఉద్యమంతో ఎవరికీ ఎలాంటి ప్రయోజనం చేకూరలేదని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అనేకమందికి అవకాశాలు వచ్చాయని తెలిపారు. మాదిగల జనాభా ప్రకారం, 12 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డా యాదయ్యమాదిగ, మహాసభ అధ్యక్షుడు గజ్జల మల్లికార్జున్, మాదిగ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఉపేందర్, ‘మహా’ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు నర్సింగరావు పాల్గొన్నారు.