హైటెక్స్లో తెలంగాణ ఉద్యమ ఘట్టాలను వివరించే ఫొటో ప్రదర్శనను తిలకించేందుకు కార్యకర్తలు ఉత్సాహం చూపారు. నాడు ఉద్యమంలో ఉన్న పలువురు అక్కడ తమ ఫొటోలను చూసి మురిసిపోవడం కనిపించింది. పలువురు ఫొటోలతో సెల్ఫీలు తీసుకున్నారు.
ప్రధాన వేదికకు వెళ్లేదారిలో కాళేశ్వరం ప్రాజెక్టు చిత్రపటంతో కూడిన స్వాగత ద్వారం విశేషంగా ఆకట్టుకున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టును తలపించేలా ఉన్న సభా వేదిక డిజైన్ ఆకర్షణగా నిలిచింది. వేదికపై ప్రతినిధుల వెనుక హైదరాబాద్లోని దుర్గం చెరువుపై నిర్మించిన వేలాడే వంతెన నమూనాను ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు విద్యుత్తు దీపాలతో ఎలాగైతే వెలిగిపోతుందో.. అచ్చం అలాగే నమూనాలోనూ లైట్లు ఏర్పాటు చేయడం ఆకట్టుకున్నది. వంతెన నమూనా మధ్యలో కాకతీయ తోరణాన్ని ఏర్పాటుచేశారు.
సభా వేదిక వద్ద మంత్రి కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు యువత, కార్యకర్తలు పోటీపడ్డారు. కేటీఆర్ సైతం ఎంతో ఓపిగ్గా అందరితో సెల్ఫీలు దిగి వారిని మరింత ఉత్సాహపరిచారు.
వివిధ జిల్లాల నుంచి వచ్చే వారికోసం విడివిడిగా రిజిస్ట్రేషన్ స్టాళ్లను ఏర్పాటుచేశారు. కార్యకర్తలు క్రమశిక్షణగా వచ్చి పేర్లు నమోదు చేసుకొన్నారు. కిట్ తీసుకొని వేదిక వద్దకు వెళ్లారు.
పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కేసీఆర్ ఉదయం 11.30 గంటలకు సభా ప్రాంగణానికి చేరుకున్నారు.
సభా వేదికపై ఏర్పాటుచేసిన పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అమరవీరుల స్థూపానికి పుష్పాంజలి ఘటించారు.
టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించిన సీఎం కేసీఆర్ సమావేశం పూర్తయ్యేవరకు ఎంతో ఉత్సాహంగా కూర్చున్నారు. తీర్మానాలు ప్రవేశపెడుతున్న సందర్భంగా వాటి ప్రాముఖ్యతను క్లుప్తంగా వివరించారు.
దాదాపు గంటపాటు సాగిన కేసీఆర్ ప్రసంగాన్ని సభికులు ఎంతో ఆసక్తిగా ఆలకించారు. అధ్యక్ష ఎన్నిక ప్రకటన వెలువడిన వెంటనే సభికులందరూ నిలబడి చప్పట్లతో కేసీఆర్కు అభినందనలు తెలిపారు.
తీర్మానాల సందర్భంగా నాయకులు ప్రసంగిస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హాస్య చతురతతో చేసిన వ్యాఖ్యలు సభికులను నవ్వించాయి.
నల్లగొండ జిల్లా నాయకులు జగదీశ్రెడ్డి, పైళ్ల శేఖర్రెడ్డి తదితరులు పోచంపల్లి చేనేత కార్మికులు తయారుచేసిన వస్త్రంతో కుట్టించిన లాల్చీలు వేసుకున్నారు. వాటిని చూసిన ముఖ్యమంత్రి కేసీఆర్ బాగున్నాయంటూ కితాబు ఇచ్చారు. రెడీమెడా? కుట్టించారా? అని అడిగి తెలుసుకున్నారు.
వేదిక వద్ద సీఎం కేసీఆర్ దళితబంధు గురించి ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతతో ప్రస్తావించారు. ‘మీరు 2006లో నా నియోజకవర్గంలోని దళితవాడకు వచ్చారు. కొందరికి సహాయం చేస్తామని అప్పుడు హామీ ఇచ్చారు’ అని సునీత చెప్పగా.. కేసీఆర్ దళితవాడలో తన పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘ఆ గ్రామం గురించి, దళితుల గురించి సమగ్ర వివరాలు ఇవ్వండి. వారితో డెయిరీ ఏర్పాటు చేయిద్దాం’ అని హామీ ఇచ్చారు.
వేదికపై మంత్రి కేటీఆర్కు సీఎం కేసీఆర్ సూచనలిచ్చారు.
పలువురు కార్యకర్తలు కేసీఆర్ జెండాలు చేతబూని గుర్రాలపై సభా ప్రాంగణానికి రావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సభా వేదికపై మంత్రులు కేటీఆర్, నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్తోపాటు మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పక్కపక్కన కూర్చొని సరదాగా ముచ్చటించుకున్నారు.
లంబాడా మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బతుకమ్మలను ఎత్తుకొని నృత్యాలుచేస్తూ తరలివచ్చారు.
మహిళా కార్యకర్తలు బతుకమ్మలు ఎత్తుకొని దాండియా ఆడుతూ సభాస్థలికి చేరుకున్నారు.
కొందరు కార్యకర్తలు ‘భావి సీఎం కేటీఆర్’ అని రాసిన ప్లకార్డులను ప్రదర్శించారు.