లీటర్పై 35 పైసల చొప్పున పెంపు
పెట్రోల్ 114.19.. డీజిల్ 107.36
క్రూడ్ రేటు తగ్గినా ఇక్కడ పైపైకే!
న్యూఢిల్లీ: పండుగ లేదు.. పబ్బం లేదు.. ప్రజలపై కేంద్రానికి కనికరం లేదు. పెట్రో ధరలకు అదుపు లేదు. వరుసగా అయిదో రోజు ఆదివారం కూడా పెట్రోల్, డీజిల్ రేట్లు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 35 పైసలు, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచిన చమురు కంపెనీలు ప్రజలకు మరోసారి పెట్రో వాత పెట్టాయి. ఫలితంగా మధ్యప్రదేశ్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.120 మార్కును దాటేసింది. రాజస్థాన్లోని గంగానగర్లో అత్యధికంగా రూ.121.52గా ఉంది. అక్కడ లీటర్ డీజిల్ రేటు రూ.112.4. తాజా పెంపుతో హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.114.19కి, లీటర్ డీజిల్ రూ.107.36కు పెరిగింది.
అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా పెట్రో ధరలను రోజువారీగా సవరిస్తామని చెప్పిన కేంద్రం, చమురు కంపెనీలు.. 4 రోజులుగా క్రూడ్ ఆయిల్ ధర తగ్గుతున్నా ధరలు పెంచుతూనే ఉంది. అక్టోబర్ 26న బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్ ధర 86.5 డాలర్లు ఉండగా, 29 నాటికి 84 డాలర్లకు తగ్గింది. అయినా దేశంలో పెట్రోల్ ధరలు పెరుగుతూనే ఉన్నాయి.
సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 31 వరకు (33 రోజుల్లో) పెట్రోల్ ధర 25 సార్లు పెరిగింది.
ఈ 33 రోజుల్లో లీటర్ పెట్రోల్పై పెరిగిన ధర రూ.8.15
సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 31 వరకు (37 రోజుల్లో) డీజిల్ రేటు 28 సార్లు పెరిగింది. ఈ 37 రోజుల్లో లీటర్ డీజిల్పై పెరిగిన ధర రూ.9.45
మే 4 నుంచి అక్టోబర్ 31 మధ్య పెట్రోల్ రూ.19.59, డీజిల్పై రూ.18.59 పెరిగింది.