న్యూఢిల్లీ : దేశంలో ఇంధన ధరల బాదుడు కొనసాగుతున్నది. వరుసగా ఐదో రోజు సోమవారం
చమురు ధరలు పైకి కదిలాయి. తొలిసారిగా లీటర్ పెట్రోల్పై 41 పైసలు, డీజిల్పై 42 పైసల వరకు పెంచాయి. తాజాగా పెంచిన ధరలతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.109.69 చేరింది. డీజిల్ లీటర్కు రూ.98.42, ముంబైలో పెట్రోల్ రూ.115.50, డీజిల్ రూ.106.62కు పెరిగింది.
చెన్నైలో లీటర్ పెట్రోల్ రూ.106.35, డీజిల్ రూ.102.59, హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రూ.114.13, డీజిల్ రూ.107.40కు చేరింది. రోజు రోజుకూ పెరుగుతూ వస్తున్న ఇంధన ధరలతో వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. గత కొద్ది రోజులుగా ఇంధన ధరలు తగ్గించాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నా ధరలు పైపైకి కదులుతున్నాయి. రోజువారీ సమీక్షలో భాగంగా సోమవారం చమురు కంపెనీలు ధరలను మరోసారి పెంచాయి. ఇప్పటికే దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్టైమ్ గరిష్ఠానికి చేరుకున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా మెట్రో నగరాల్లో పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. మధ్యప్రదేశ్లో లీటర్ పెట్రోల్ రూ.120 మార్క్ను ధాటింది.
న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.109.69, డీజిల్ రూ.98.42
ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.115.50, డీజిల్ 106.62
కోల్కతాలో పెట్రోల్ లీటర్ రూ.110.15, డీజిల్ రూ.101.56
చెన్నైలో పెట్రోల్ లీటర్ రూ.106.35, డీజిల్ 102.59
హైదరాబాద్లో పెట్రోల్ రూ.114.13, డీజిల్ 107.40
పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం రూపంలో కేంద్ర ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్థంలో రూ.43వేలకోట్ల కంటే ఎక్కువగానే ఆదాయం వచ్చింది. ధరలను సమీక్షిస్తున్న సమయంలో ఉత్పత్తులపై మొత్తం ఎక్సైజ్ సుంకం వసూళ్లు ఏడాది ప్రతిపాదికన 33 శాతం పెరిగి రూ.1.71లక్షల కోట్లకు చేరాయి. మహమ్మారికి ముందు (2019) ఇది రూ.93,930 కంటే 73శాతం ఎక్కువగా. 2020-21 ఏప్రిల్-సెప్టెంబర్లో మొత్తం ఎక్సైజ్ సుంకం వసూళ్లు రూ.1.28 లక్షల కోట్లు.
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) డేటా ప్రకారం.. 2020-21లో పెట్రోలియం ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకం రూపంలో ప్రభుత్వం మొత్తం 3.89 లక్షల కోట్లు ఆర్జించింది. 2019-20లో రూ.2.39 లక్షల కోట్లు, 2018-19లో రూ.2.3 లక్షల కోట్లు. పెట్రోలియం ఉత్పత్తులపై పెరిగిన ఎక్సైజ్ సుంకం కారణంగా 2020-21 ప్రథమార్థంలో రూ.42,931 కోట్ల ఆదాయం సమకూరిందని సీజీఏ డేటా తెలిపింది. 2021-22లో వసూళ్లు రూ.లక్ష కోట్ల కంటే ఎక్కువ ఉండవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. గతేడాది పెట్రోల్పై ఎక్సైజ్ సుంకాన్ని లీటర్కు రూ.19.98 నుంచి రూ.32.9కి, డీజిల్పై లీటర్ రూ.31.80కి కేంద్రం పెంచింది.