మరో రెండు సర్వీసులకు కూడా..
సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు
న్యూఢిల్లీ, మార్చి 25: సివిల్ సర్వీసెస్ రాతపరీక్ష ఉత్తీర్ణులైన దివ్యాంగ అభ్యర్థులు ఐపీఎస్, ఐఆర్పీఎఫ్ఎస్, డీఏఎన్ఐపీఎస్ సర్వీసులకు ఆప్షన్లు(ప్రాధాన్యతలు) ఇచ్చుకునేందుకు సుప్రీంకోర్టు తాత్కాలిక అనుమతి ఇచ్చింది. దీనికి సంబంధించిన అప్లికేషన్లను ఏప్రిల్ 1 నాటికి యూపీఎస్సీకి సమర్పించాలని సూచించింది. ఈ మేరకు జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, ఏఎస్ ఓకా ధర్మాసనం శుక్రవారం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఆయా సర్వీసుల నుంచి దివ్యాంగులను మినహాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిరుడు ఆగస్టులో ఇచ్చిన నోటిఫికేషన్ను సవాల్ చేస్తూ దివ్యాంగుల హక్కుల జాతీయ వేదిక అనే ఎన్జీఓ సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేసింది. ఈ విషయంలో అఫిడవిట్ దాఖలు చేసేందుకు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రెండు వారాల సమయం కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఏప్రిల్ 18కి వాయిదా వేసింది.