న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి మొదటి దశ అనంతరం ప్రభుత్వం, ప్రజలు, పాలనా యంత్రాంగంలో నిర్లక్ష్యం పెరిగిందని, ఫలితంగా ప్రస్తుత సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయని ఆర్ఎస్ఎఫ్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. కరోనా మహమ్మారితో పోరాడుతున్న ప్రజల్లో విశ్వాసం కల్పించేందుకు ఆర్ఎస్ఎస్ నిర్వహించిన ‘పాజిటివిటీ అన్లిమిటెడ్’ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సెకండ్ వేవ్ వస్తుందని అందరికీ తెలుసునని.. వైద్యులు సైతం హెచ్చరించినా నిర్లక్ష్యంగానే ఉన్నామన్నారు. ప్రస్తుతం థర్డ్ వేవ్ కూడా దేశంలో వస్తుందని చెబుతున్నారని, దానికి భయపడుతామా?.. సరైన దృక్పథంలో వైరస్పై పోరాడి గెలుద్దామా? అని ప్రశ్నించారు.
ప్రస్తుత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకొని భవిష్యత్ వైపు దేశం దృష్టిని కేంద్రీకరించాలని సూచించారు. అందరం కలిసికట్టుగా వైరస్ను ఓడిద్దామని పిలుపునిచ్చారు. మానవ జీవితంలో జనన, మరణాలు సహజమని.. అవి మనల్ని భయపెట్టలేవని, ప్రస్తుత పరిస్థితులు మనకు భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్పుతాయన్నారు. వివిధ సివిల్ సర్వీసెస్ గ్రూపుల సహకారంతో ఆర్ఎస్ఎస్ ‘కోవిడ్ రెస్పాన్స్ టీం’ సమన్వయంతో.. మే 11 నుంచి కార్యక్రమం నిర్వహిస్తుండగా.. విప్రో గ్రూప్ వ్యవస్థాపక అధ్యక్షుడు అజీమ్ ప్రేమ్జీ, ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ సైతం ఆన్లైన్లో ప్రసంగించారు.