మేడ్చల్ రూరల్, జనవరి 16 : క్షేత్రగిరి వేంకటేశ్వర స్వామి జాతర కనుల పండువగా జరిగింది. స్వామి వారిని కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మేడ్చల్ మండలంలోని రాజబొల్లారం గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన ఘన్పూర్ శివారులోని క్షేత్రగిరి గుట్టపై వెలసిన వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా నిర్వాహకులు భక్తుల కోసం సౌకర్యాలు కల్పించారు. స్వామి వారిని దర్శించుకోవడానికి మేడ్చల్ జిల్లా, సమీప సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల ప్రజలు, భక్తులు వేలాదిగా తరలివచ్చారు. భక్తుల రాకతో క్షేత్ర ప్రాంగణం కిటకిటలాడింది. ఉదయం నుంచి రాత్రి వరకు జన సంచారంతో కోలాహలంగా మారింది. గుట్టపై మేడ్చల్ మున్సిపాలిటీ 6వ వార్డు కౌన్సిలర్ మణికంఠ గౌడ్ భక్తులకు అన్నదానం చేశారు.
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి ..
స్వామి వారిని మంత్రి మల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, పంటలు పుష్కలంగా పండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ వైస్ ఎంపీపీ వెంకటేశ్ ముదిరాజ్, రాజబొల్లారం ఉప సర్పంచ్ నారాయణ, మార్కెట్ కమిటీ చైర్మన్ భాస్కర్ యాదవ్, నాయకులు రాజమల్లారెడ్డి, దర్శన్, నాయకులు, ప్రజలు, భక్తులు పాల్గొన్నారు.