హైదరాబాద్, అక్టోబర్ 26 (నమస్తే తెలంగాణ): అబద్ధమాడినా అతికినట్టుండాలి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఈ కనీస సోయి కూడా లేనట్టుంది.. అందుకే ఏకంగా తెలంగాణ అమరవీరులను కేసీఆర్.. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం సందర్భంగా స్మరించుకోలేదంటూ నీచమైన ప్రచారానికి ఒడిగట్టారు. టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశాన్ని ప్రపంచంలోని కోట్లమంది తెలంగాణ వాదులు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. కేసీఆర్ ఏం మాట్లాడారో.. సభలో ఏం జరిగిందో కండ్లారా చూశారు. సమావేశం ఘనంగా జరిగిన తీరు చూసి రేవంత్కు ఏం మాట్లాడాలో పాలుపోలేదేమో.. మీడియాను పిలిపించుకుని నోటికొచ్చినట్టు మాట్లాడటంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
టీఆర్ఎస్ సమావేశంలో పార్టీ అధ్యక్షుడి హోదాలో కేసీఆర్.. తెలంగాణకోసం జీవితాంతం తపించిపోయిన మహనీయులకు, ఉద్యమ వ్యూహకర్తలకు, తెలంగాణ కోసం ఆత్మాహుతితో తమను తాము సమర్పణం చేసుకొన్న అమరులందరికీ ఘనంగా నివాళులర్పించారు. వారిని పేరుపేరునా స్మరించుకొన్నారు. కానీ.. కొండా లక్ష్మణ్బాపూజీ, జయశంకర్, విద్యాసాగర్రావు, శ్రీకాంతచారి వంటివారిని తలుచుకోలేదంటూ, అమరవీరులను గౌరవించలేదంటూ రేవంత్రెడ్డి ఆరోపించారు. రేవంత్ తీరుపట్ల టీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. రేవంత్ తన తెలివితక్కువతనాన్ని బయటపెట్టుకున్నారంటూ ఎద్దేవాచేస్తున్నారు.
తలపట్టుకొంటున్న కాంగ్రెస్
ఇప్పటికే నిండా మునిగిపోయిన కాంగ్రెస్ను రేవంత్రెడ్డి తన పైత్యంతో పాతాళానికి తొక్కేస్తున్నారని కాంగ్రెస్ శ్రేణులు ఆవేదన వ్యక్తంచేస్తున్నాయి. అవగాహనారాహిత్యంతో రేవంత్ చేస్తున్న అడ్డగోలు వ్యాఖ్యలకు క్షేత్రస్థాయిలో తాము సమాధానం చెప్పుకోలేక తలదించుకోవాల్సి వస్తున్నదని ఆ పార్టీ నేతలు బాధపడుతున్నారు. సీనియర్లను పట్టించుకోకపోవడం, ఒంటెత్తు పోకడతో ఇప్పటికే పార్టీలో వర్గాలను తయారుచేసిన రేవంత్.. రోజుకో తలనొప్పి తెస్తున్నారని చెప్తున్నారు.
ఇదీ జరిగింది
ప్లీనరీలో అధ్యక్ష ఎన్నిక పూర్తయిన తర్వాత కేసీఆర్ ప్రసంగిస్తూ కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్, విద్యాసాగర్రావు, శ్రీకాంతచారి సహా అమరులందరినీ స్మరించుకొన్నారు. ‘2001 ఏప్రిల్ 27న స్వర్గీయ కొండా లక్ష్మణ్ బాపూ జీ ఆశ్రయంలో, జలదృశ్యం అనే ఆవరణలో ఈ గులాబీ పతాకాన్ని ఆవిష్కరించాం’ అని స్పష్టంగా చెప్పారు. ‘అనేకమంది మిత్రులు మనతో కలిసి పనిచేస్తూ.. వారి పోరాట పంథాను కొనసాగిస్తూ కొందరు రాష్ట్రం సిద్ధించకముందు మనల్ని వీడిపోగా, మరికొందరు రాష్ట్రం వచ్చిన తర్వాత కాలధర్మం చేశారు. వారిలో అగ్రగణ్యులు ప్రొఫెసర్ జయశంకర్, కల్లెం యాదగిరిరెడ్డి, ఆర్ విద్యాసాగర్రావు. శ్రీకాంతాచారి, ఇషాన్రెడ్డి వంటి అనేకమంది మిత్రులు బలిదానాలు చేశారు.
వీరితోపాటు టీఆర్ఎస్కు చెందిన గొప్ప నాయకులు, నిబద్ధులైన కార్యకర్తలు కీర్తిశేషులయ్యారు. అలుపెరగని ఉద్యమనేత, తన జీవిత సర్వస్వాన్ని తెలంగాణ కోసం అర్పించిన నాయిని నర్సింహారెడ్డి, మాధవరం సుదర్శన్రావు, అజ్మీరా చందూలాల్, సోలిపేట రామలింగారెడ్డి, నోముల నర్సింహయ్య, మాలం మల్లేశ్, కావేటి సమ్మయ్య, కావేటి లక్ష్మీనారాయణ, పట్లోల్ల మాణిక్యరెడ్డి, ఎడ్మ కృష్టారెడ్డి, ఎంఏ బేగ్, ఇతర కార్యకర్తల మృతిపట్ల ఈ సభ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటిస్తున్నది. తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం, టీఆర్ఎస్ను బలోపేతంచేయడం కోసం వారు అందించిన సేవలను పార్టీ సగౌరవంగా స్మరించుకుంటున్నది. తెలంగాణ చరిత్రలో వారిపేర్లు చిరస్థాయిగా నిలువాలని మనసారా కోరుకొంటున్నది’ అని సీఎం కేసీఆర్ ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం సభ రెండు నిమిషాలు మౌనం పాటించింది. కానీ.. రేవంత్రెడ్డికి ఇవేవీ వినిపించలేదు కాబోలు!